Edida Bhaskara Rao : ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బలమైన అభ్యర్థులే ఢీకొనడం కామన్. అయితే బలహీనులు కూడా ఒక కాజ్తో ఎన్నికల్లో పోటీ చేయడం అసాధారణ విషయం. ఇది ప్రజల్లో వచ్చిన సామాజిక చైతన్యానికి నిదర్శనం. ఓటుపై ప్రజలకు పెరిగిన భరోసాకు ఇది సాక్ష్యం. ఏపీలో ప్రస్తుతం చాలా హాట్ సీట్లు ఉన్నాయి. వాటిలో హై ప్రొఫైల్ అభ్యర్థులు బరిలో ఉన్నాయి. పిఠాపురం కూడా తప్పకుండా ఆ జాబితాలో ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వంగా గీత బరిలోకి దిగారు. ఈ తరుణంలో పిఠాపురానికి చెందిన ఓ సామాన్యుడు కూడా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యాడు. ఆయన పేరే ఏడిద భాస్కర్రావు. ఇంతకీ ఎవరాయన ? అనే దానిపై అంతటా డిస్కషన్ జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
ఏడిద భాస్కరరావు.. పిఠాపురంలో అందరికీ సుపరిచితుడు. పట్టణంలోని సీతయ్యగారితోట ఏరియాలో ఆయన నివసిస్తుంటారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ కాలేజీ దగ్గర ఆయన చెప్పులు కుడుతుంటారు. చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. భాస్కర రావు డిగ్రీలో రాజనీతిశాస్త్రం కోర్సు చేశారు. ఉద్యోగాల కోసం భాస్కరరావు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయన చెప్పులు కుట్టే పని చేస్తున్నారు. తనలా చదువుకుని ఉద్యోగాలు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతీ యువకుల కష్టాలను అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే పిఠాపురం ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగానని భాస్కర రావు తెలిపారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ భాస్కరరావు ఇప్పటికే తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పది మంది సంతకాలు కూడా చేశారు. నియోజకవర్గ సమస్యలకు పరిష్కారాలను వెతకడమే తన ఎజెండా అని భాస్కరరావు తేల్చి చెబుతున్నారు. తన దగ్గర రూ.20 వేల నగదు మాత్రమే ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆయన ప్రస్తావించారు. చెప్పులు కుట్టుకుంటూనే అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేసిన అబ్రహం లింకన్ను ఆదర్శంగా తీసుకున్న భాస్కర్రావు.. పిఠాపురం ఎన్నికల బరిలోకి దిగడం గొప్ప విషయమే.