Houthis Vs Israel : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు అరబ్ దేశాల మిలిటెంట్ గ్రూపులు తిరగబడ్డాయి. లెబనాన్ బార్డర్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపైకి కాల్పులు జరుపుతోంది. మరోవైపు సిరియాలోని ఇరాన్ సపోర్టు కలిగిన మిలీషియా కూడా ఇజ్రాయెల్ వైపు కాల్పులు జరుపుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు వేస్తూ వచ్చిన యెమన్ దేశంలోని హౌతీ మిలిటెంట్ గ్రూప్.. ఇప్పుడు అధికారికంగా ఇజ్రాయెల్పై యుద్ధాన్ని ప్రకటించింది. అమాయక గాజా ప్రజలకు మద్దతుగా తాము ఈ యుద్ధం చేస్తామని తెలిపింది. ‘‘అమెరికాకు మరణం, ఇజ్రాయెల్కు మరణం, యూదులను శపించండి.. ఇస్లాంకు విజయం’’ అని హౌతీ గ్రూప్ నినాదమిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
యెమన్ నుంచి ఇజ్రాయెల్కు దాదాపు 1,000 మైళ్ల దూరం ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్యలో జోర్డాన్, సౌదీ అరేబియా దేశాల భూభాగం ఉంటుంది. యెమన్ వేసే డ్రోన్లు, మిస్సైళ్లు జోర్డాన్, సౌదీ అరేబియాలను దాటుకుంటూ ఇజ్రాయెల్లోని లక్షిత ప్రాంతాలను చేరుకుంటాయి. దీంతో సౌదీ అరేబియా ఆందోళనకు గురవుతోంది. హౌతీల మిస్సైళ్లు, డ్రోన్లను ఆపేందుకు ఇజ్రాయెల్ సముద్ర తీరంలో అమెరికా భారీ యుద్ధ వాహక నౌకలు సిద్ధంగా ఉంది. ఇది యెమన్ వైపు నుంచి వచ్చే మిస్సైళ్లు, డ్రోన్లను ఆపుతోంది. అయితే పొరపాటున ఒకటి, రెండు మిస్సైళ్లు, డ్రోన్లు మిస్సయి పోయి ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై పడుతున్నాయి.
ఇజ్రాయెల్ -గాజా యుద్ధం పశ్చిమాసియాలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించినట్లయింది. ఇప్పటికే సిరియాలోని ఆర్మీ బేస్లపై, లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు చేసింది. ఇక యెమన్లోని హౌతీ స్థావరాలను కూడా ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో యుద్ధం విస్తరించడం, ఇంకొన్ని నెలలపాటు ఇది కొనసాగడం ఖాయమనే సంకేతాలు(Houthis Vs Israel) వెలువడ్డాయి.