చైనాలో సైనిక కుట్ర అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ మంగళవారం ఓ ఈవెంట్లో ప్రత్యక్షమయ్యారు. వచ్చేనెల 16 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను నిన్న ఆయన ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా ఉబ్బెకిస్తాన్లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్ థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత సెప్టెంబర్ 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్పింగ్ బయట కనపడలేదు. అయితే జిన్పింగ్ ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎస్సీవో సదస్సు తర్వాత ఆయన బయటకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్పింగ్ తిలకించారని చైనా న్యూస్ మీడియా తెలిపింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పలువురు నాయకులు ఉన్నారు. అయితే.. చైనాలో కొవిడ్-19 జీరో పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారు వారం పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండటం తప్పనిసరి. తర్వాత మూడు రోజుల పాటు ఇంట్లోనే బస చేయాలి. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.