ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా శుక్రవారం ఇండియా- రష్యా ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజును రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రస్తావించారు. అయితే మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం చెప్పలేదు. ఇలా ఎందుకు చేశారు? అనే దానిపై పుతిన్ క్లారిటీ ఇచ్చారు.
అందుకే చెప్పలేదు మిత్రమా
“నా ప్రియమైన మిత్రమా, రేపు నువ్వు నీ పుట్టినరోజు జరుపుకోబోతున్నావు. కానీ రష్యన్ సంప్రదాయం ప్రకారం.. మేము ముందుగా అభినందనలు చెప్పబోము. కాబట్టి నేను ప్రస్తుతం అలా చేయలేను. భారతదేశం మీ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ”అని రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీతో అన్నారు.
2021 డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే..
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ చివరిసారిగా డిసెంబర్ 2021లో కలుసుకున్నారు. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత మొదటిసారిగా సమర్కండ్లో పుతిన్, మోదీ భేటీ సమావేశం జరిగింది.శాంతి మార్గాన్ని చర్చించడానికి శిఖరాగ్ర సమావేశం ఒక అవకాశం అని ప్రధాని మోదీ తమ అభిమతాన్ని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం యుగం యుద్ధ యుగం కాదని తనకు తెలుసని.. దీని గురించి గతంలోనే ఫోన్ చర్చల సమయంలో చెప్పానని ప్రధాని మోదీ పుతిన్తో అన్నారు. ఉక్రెయిన్ గురించి భారతదేశం ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని, వివాదాన్ని ముగించడానికి రష్యా చేయగలిగినదంతా చేస్తుందని పుతిన్ మోదీకి వివరించారు. కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడి తరువాత ఇతర దేశాలు కొనుగోళ్లను తగ్గించడంతో చైనా తర్వాత భారతదేశం రష్యా నంబర్ 2 చమురు కొనుగోలుదారుగా మారింది.