Houthis Warning : పాలస్తీనా ప్రజలకు మద్దతుగా యెమన్ హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రం వేదికగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా మరో వార్నింగ్ ఇచ్చారు. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఆపకుంటే ఎర్ర సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో యావత్ ప్రపంచానికి ఇంటర్నెట్ సప్లై ఆగిపోతుందని తెలిపారు. ఈమేరకు యెమన్ హౌతీలు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. బాబ్ అల్-మందబ్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామన్నారు. ఇప్పటికైనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేలా ప్రపంచ దేశాలు ఒత్తిడిని పెంచాలని కోరారు. ఎర్ర సముద్రంలో అమెరికా యాక్టివిటీతో భయపడేది లేదని హౌతీలు స్పష్టం చేశారు. ‘‘మేం ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేస్తే యావత్ ప్రపంచం రాతియుగంలోకి వెళ్లిపోతుంది’’ అని సవాల్(Houthis Warning) విసిరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ యెమన్ హౌతీలు ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేసినా భారత్కు పెద్దగా ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. సముద్ర గర్భం నుంచి వివిధ దేశాల మధ్య వేర్వేరు సంస్థలకు చెందిన ఇంటర్నెట్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. మన దేశానికి చెన్నై, పుదుచ్చేరి, కోల్కతా, ముంబై వంటి ఓడరేవు పట్టణాల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ హబ్లు ఉన్నాయి. ఒకవేళ ముంబై-హైదరాబాద్ మధ్య ఉండే ఇంటర్నెట్ కేబుల్ లైన్లో ఇబ్బందులు తలెత్తితే.. సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా కోల్కతా హబ్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తారు. దీంతోపాటు పలు దేశాల నుంచి ఎమర్జెన్సీ ఇంటర్నెట్ పొందే మార్గాలు కూడా భారత్కు ఉన్నాయి. ఏదిఏమైనప్పటికీ ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలిగితే నేటి ఇంటర్నెట్ యుగం స్తంభించిపోయే ముప్పు ఉంటుంది. ఈవిధమైన తీవ్ర పర్యవసానాలకు దారితీస్తున్న గాజా – ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపే దిశగా ఇకనైనా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. తద్వారా గాజాపై ఇజ్రాయెల్ దాడులను కంటిన్యూ చేయొచ్చనే సిగ్నల్ ఇచ్చింది. దీన్నిబట్టి ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం వెనుక అమెరికా ఉందనేది క్లియర్ అయిపోయింది.