US – UK Vs Houthis : మరో యుద్ధం.. యెమన్ హౌతీలపై అమెరికా, బ్రిటన్ ఎటాక్స్ షురూ

US - UK Vs Houthis : గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడ్డాయి.

  • Written By:
  • Updated On - January 12, 2024 / 07:50 AM IST

US – UK Vs Houthis : గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ విరుచుకుపడ్డాయి. అమెరికా, బ్రిటన్ సైన్యాలు యెమెన్‌లోని హౌతీ నియంత్రిత ప్రాంతాలపై గురువారం రాత్రి దాడులను ప్రారంభించాయి. ఈ దాడుల్లో అమెరికా, బ్రిటన్‌తో పాటు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ సైన్యాలు కూడా పాల్గొన్నాయి. ఈవివరాలను అమెరికా వైట్ హౌస్ కూడా ధ్రువీకరించింది.  ‘‘ ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికిగానూ ఎలాంటి చర్యలను తీసుకోవడానికైనా మేం వెనుకాడం’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన విడుదల చేశారు.  యెమన్ హౌతీల స్థావరాలపై దాడులకు తోమాహాక్ క్షిపణులను అమెరికా వినియోగించింది. గైడెడ్ మిస్సైల్ సబ్‌మెరైన్ ‘USS ఫ్లోరిడా’ను కూడా ఈ దాడుల కోసం అమెరికా వాడుకుంది. డజనుకుపైగా హౌతీ లక్ష్యాలపై ఎయిర్ స్ట్రైక్ కూడా చేశారు. హౌతీల రాడార్ సిస్టమ్‌లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలపై ఎటాక్స్(US – UK Vs Houthis) జరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

హౌతీ నాయకుడు అబ్దుల్ మాలెక్ అల్ హౌతీ గురువారం మాట్లాడుతూ.. ‘‘ యెమన్‌పై అమెరికా దాడికి సమాధానం ఇస్తాం. సముద్రంలో మోహరించినన అమెరికా నౌకలపై దాడి చేయడం కంటే ప్రతిస్పందన చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని వార్నింగ్ ఇచ్చారు. ‘పాలస్తీనాకు యెమెన్‌ పొరుగు దేశం కాదు కదా..! పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్‌ మిలిటెంట్స్‌కు మీరు ఎందుకు సహకరిస్తున్నారు..?’ అని హౌతీ నేత అల్‌ హౌతీని బీబీసీ యాంకర్‌ ప్రశ్నించగా.. ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో తమ ప్రమేయాన్ని అల్ హౌతీ సమర్థించుకున్నారు. అయినా తాము పాలస్తీనాకు బహిరంగంగా ఎప్పుడూ మద్దతు తెలపలేదని చెప్పారు. పాలస్తీనియన్లు వాళ్లు చేయాల్సింది చేస్తారన్నారు.

Also Read: US Vs Iran : అమెరికాపై ఇరాన్ ప్రతీకారం.. యూఎస్ నౌక సీజ్.. ఎందుకు ?

గత రెండు రోజులుగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్ట్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఆయన యెమన్ హౌతీల అంశంపై మిడిల్ ఈస్ట్ దేశాల నాయకులందరితో చర్చించారు. తాము హౌతీలపై చేయనున్న దాడిని అంతర్జాతీయ సమాజానికి ప్రయోజనం కోణంలోనే చూడాలని వారికి బ్లింకెన్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే యెమన్‌పై గురువారం రాత్రి దాడులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రంలో యెమన్ హౌతీల దాడులను వ్యతిరేకిస్తూ ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, జపాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పదకొండు దేశాలు ఆమోదించాయి. కానీ చైనా, రష్యా సహా నాలుగు దేశాలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.