Russia Vs Ukraine War : రెండేళ్ల కిందట రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి బీజాలు పడ్డాయి. ఈ యుద్ధ హోమంలో ఎంతోమంది అమాయకులు, నిర్భాగ్యులు సమిధలయ్యారు. ఈ యుద్ధం ప్రారంభమై శనివారం(ఫిబ్రవరి 24)తో రెండేళ్లు గడిచాయి. ఈ వార్లో ఉక్రెయిన్, రష్యా దేశాలు ఏం సాధించాయని చూస్తే.. వెక్కిరిస్తున్న పుర్రెలు, నిస్తేజంగా మారిన నగరాలు, బూడిద కుప్పల్లా మిగిలిన భవంతులే కనిపిస్తాయి.
We’re now on WhatsApp. Click to Join
ఉక్రెయిన్లోని ప్రధాన భూభాగాన్ని ఆక్రమించుకోవడమే లక్ష్యంగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి దిగారు.ఈక్రమంలో నాటో దేశాల కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ యత్నించింది. దీన్ని వ్యతిరేకించిన పుతిన్.. గతంలోనే ప్రారంభించిన ఆక్రమణల యుద్ధాన్ని రెండేళ్ల కిందట ముమ్మరం చేసింది. యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ (Russia Vs Ukraine War) సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా. 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియన్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పైచిలుకు మంది క్షతగాత్రులయ్యారు. కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది.
యుద్ధం తొలినాళ్లలో ఉక్రెయిన్పై రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించాయి. దీంతో యావత్ యూరప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికా, యూరప్ దేశాలు అందించిన ఆయుధ సాయంతో ఉక్రెయిన్ ఆర్మీ పైచేయి సాధిస్తూ వచ్చింది. యుద్దం కారణంగా ఉక్రెయిన్, రష్యాలు నష్టపోయాయి. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్ పైచేయి సాధించింది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్పై రెండు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి.
వాస్తవానికి ఫిబ్రవరి 2014 చివరలో రష్యా క్రిమియాను ఆక్రమించడం ప్రారంభించింది, ఇది రష్యా-ఉకెయిన్ యుద్ధానికి నాంది పలికింది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 22, 23 తేదీలలో, యనుకోవిచ్ బహిష్కరణకు గురైన వెంటనే సంబంధిత రష్యన్ దళాలు, ప్రత్యేక దళాలు క్రిమియా సరిహద్దుకు దగ్గరగా వెళ్లాయి. ఇది ఇరు దేశాల మధ్య యుద్ధానికి కారణంగా మారింది. వాస్తవానికి ఈ యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగుస్తుందని అనుకున్నప్పటికీ రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉంది.