తమ పోరాటానికి మద్దతు ఇవ్వండి.. భారత్‌కు బలూచ్ నేత బహిరంగ లేఖ

శాంతి, సార్వభౌమత్వం సాధన కోసం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Support their struggle.. Baloch leader's open letter to India

Support their struggle.. Baloch leader's open letter to India

. జైశంకర్‌కు మీర్ యార్ బలూచ్ విజ్ఞప్తి

. సీపీఈసీ తుది దశ—ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు

. భారత్ పాత్ర, చారిత్రక బంధాలు, స్పందన కోసం ఎదురుచూపు

Mir Yar Baloch: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ బలూచ్ మానవ హక్కుల నేత మీర్ యార్ బలూచ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదిక ‘X’లో ఈ లేఖను ఆయన విడుదల చేశారు. బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఆక్రమణ, అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. శాంతి, సార్వభౌమత్వం సాధన కోసం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా–పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టు తుది దశకు చేరుకోవడంతో, రాబోయే నెలల్లో బలూచిస్థాన్‌లో చైనా సైన్యాన్ని మోహరించే ప్రమాదం ఉందని మీర్ యార్ బలూచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

“బలూచిస్థాన్ గడ్డపై చైనా సైనికులు అడుగుపెడితే, అది భారత్‌తో పాటు బలూచిస్థాన్ భవిష్యత్తుకూ ఊహించని ముప్పుగా మారుతుంది” అని ఆయన హెచ్చరించారు. చైనా–పాకిస్థాన్ కూటమి రెండు ప్రాంతాలకూ వ్యూహాత్మక ప్రమాదమని పేర్కొంటూ, ఈ సమస్యను మూలాల నుంచే పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పాక్ ఆక్రమణ, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం, వ్యవస్థాగత అణచివేత వల్ల బలూచ్ ప్రజలు 79 ఏళ్లుగా నలిగిపోతున్నారని లేఖలో వివరించారు. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వంటి చర్యలను మీర్ యార్ బలూచ్ ప్రశంసించారు. ఇవి ప్రాంతీయ భద్రత పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

బలూచిస్థాన్‌లోని హింగ్లాజ్ మాత ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలను ప్రస్తావిస్తూ, భారత్–బలూచిస్థాన్ మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధాలను గుర్తుచేశారు. ఆరు కోట్ల బలూచ్ ప్రజల తరఫున శాంతి, వాణిజ్యం, రక్షణ, భద్రత రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం కోరుతున్నట్లు తెలిపారు. అయితే, ఈ లేఖపై ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ లేదా చైనా ప్రభుత్వాల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సీపీఈసీ వెళ్లడం వల్ల భారత్ ఈ ప్రాజెక్టును మొదటి నుంచే వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఈ లేఖకు వచ్చే ప్రతిస్పందనపై దృష్టి కేంద్రీకృతమైంది.

  Last Updated: 02 Jan 2026, 07:32 PM IST