Kush Drug : ఆఫ్రికా ఖండంలోని సియెర్రా లియోన్ దేశంలో ఈనెల 4వ తేదీ నుంచి నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది. దీనికి కారణం.. హింసాకాండ కాదు!! సైనిక తిరుగుబాటు కాదు!! డ్రగ్స్ మహమ్మారి !! ఔను.. డ్రగ్స్ మత్తులో దేశ ప్రజలు ఊగుతున్న వేళ ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆ దేశ పాలకులు జాతీయ ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎమర్జెన్సీ ప్రకటించేంత రేంజులో సియెర్రా లియోన్ను కుదిపేస్తున్న ఆ డ్రగ్స్(Kush Drug) ఏమిటి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
సియెర్రా లియోన్లో చాలామంది యువకులు ఒక రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో ఎక్కడికక్కడ పడిపోతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్ బయో ఇటీవల ఎమర్జెన్సీ విధించారు. సియెర్రా లియోన్ దేశంలో యువతను బానిసగా మార్చుకున్న అతిపెద్ద డ్రగ్ పేరు ‘కుష్’. గంజాయిని సింథటిక్ రూపంలో అందించే డ్రగ్ ఇది. దీన్ని తిన్నాక సుఖవంతమైన ఫీలింగ్లోకి జారుకుంటున్నారు. సోమరులుగా మారుతున్నారు. తమలో తామే ఆనందాన్ని ఫీల్ అవుతున్నారు. ఈ డ్రగ్ తీసుకున్నాక.. నడిరోడ్డుపై ఏం చేస్తున్నారనే విషయం కూడా వాటికి బానిసలుగా మారిన వారికి గుర్తుండటం లేదు. సియెర్రా లియోన్ యువతను కబంధ హస్తాల్లోకి తీసుకున్న ఈ కుష్ డ్రగ్స్.. ఆరేళ్ల క్రిితమే ఈ దేశంలోకి ఎంటరయ్యాయి. క్రమంగా డ్రగ్స్ ముఠాలు దీని విక్రయాలను పెంచడంతో యువత దానికి బానిసలుగా మారిపోయారు.
చౌకగా లభిస్తుండటంతో దీని సేల్స్ చాలా తక్కువ టైంలోనే జోరందుకున్నాయి. ఇదే అదునుగా సియెర్రా లియోన్ దేశంలోని డ్రగ్ మాఫియాలు వందల కోట్లు సంపాదించాయని తెలుస్తోంది. ప్రభుత్వాల సహకారం లేకుండా డ్రగ్స్ విదేశాల నుంచి దేశాల్లోకి ప్రవేశిస్తాయా ? తనిఖీలు కరెక్టుగా ఉంటే డ్రగ్స్ సప్లై జరుగుతుందా ? అక్కడి ప్రభుత్వ పెద్దలు లంచాలకు రుచిమరిగి దేశ యువత ప్రాణాలను డ్రగ్ మాఫియాల చేతిలో తాకట్టుపెట్టారు. దానికి పర్యవసానాన్ని ఈరోజు సియెర్రా లియోన్ దేశం అనుభవిస్తోంది.
కుష్ డ్రగ్స్ ఎందుకు వివాదాస్పదంగా మారాయంటే.. వాటిలో మనుషుల ఎముకల పొడిని కలుపుతున్నారట !! ఈమేరకు సమాచారంతో అంతర్జాతీయ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. కుష్ డ్రగ్స్ తయారీలో వాడేందుకు మనుషుల ఎముకలు అవసరమై.. సియెర్రా లియోన్లోని డ్రగ్స్ ముఠాలు ఏకంగా శ్మశానాలనే తవ్వేస్తున్నట్లు తెలుస్తోంది. వందలాది సమాధులను తవ్వేసి.. అస్థిపంజరాలను సేకరించి.. వాటి ఎముకలను పొడిగాచేసి.. కుష్ డ్రగ్స్లో కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సియెర్రా లియోన్ దేశంలో వందలాది సమాధులను డ్రగ్స్ ముఠాలు తవ్వినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శ్మశానాల వద్ద అక్కడి ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. కుష్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. ఈ డ్రగ్ కారణంగా యువకుల అవయవాలు దెబ్బతిని చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ముఖాలు వాచిపోయి శరీరమంతా గాయాలతో చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని చెప్పారు.