బ్రిటన్లో వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది. వలసలను తగ్గించడానికి అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్ పూర్తిగా కట్టుబడి ఉన్నారు’’ అని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి మీడియాతో అన్నారు.
ప్రధానమంత్రి రిషి సునాక్ విదేశీయులకు మంజూరు చేస్తున్న స్టడీ వీసాలపై కఠినంగా వ్యవహరించవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నివేదికల మధ్య దేశం మొత్తం ఇమ్మిగ్రేషన్ గణాంకాల నుండి అంతర్జాతీయ విద్యార్థులను తొలగించాలని భారతీయ ప్రవాసుల నేతృత్వంలోని విద్యార్థి సంఘం UK ప్రభుత్వాన్ని కోరింది.
కొన్ని UK మీడియా నివేదికల ప్రకారం.. దేశం నికర వలసలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వలసదారుల సంఖ్యను తగ్గించడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి అన్నారు. ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రిటన్లో ఇటీవల వలసల సంఖ్య పెరిగిపోయింది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) గణాంకాల ప్రకారం.. 2021లో 1.73 లక్షల మంది వలసదారులు ఉండగా.. జూన్, 2022 నాటికి ఈ సంఖ్య 5,04,000కి చేరింది. విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. వలసల విషయంలో యూకే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది.