ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేకంగా ఆందోళలను మరింత తీవ్రతరం అయ్యాయి. పోలీసు కస్టడీలో 22 ఏళ్ల మహిళ మహసా అమినీ మృతికి నిరసనగా రాజధాని టెహ్రాన్తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన నిరసనల్లో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆందోళనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఇరాన్ గవర్నర్ ఇస్మాయిల్ జరీ కౌషా ధృవీకరించారు. వీరిని కాల్చి చంపినట్లు విచారణలో తేలిందని ఆ దేశ వాయువ్య కుర్దిస్థాన్ ప్రావిన్స్ గవర్నర్ కౌషా తెలిపారు. నిరసనల్లో హత్యల వెనుక ప్రభుత్వ వ్యతిరేకుల హస్తం బయటపడిందని అన్నారు. హత్యలు చేసేందుకు ఆయుధాలను ప్రభుత్వ భద్రతా బలగాలు ఉపయోగించలేదన్నారు.
దివాండరెహ్లో ఒకరు చనిపోగా, ఆసుపత్రి సమీపంలో పార్క్ చేసిన కారులో మరొకరు శవమై కనిపించారు. ఈ కేసులో మూడో వ్యక్తి మృతిపై విచారణ జరుగుందన్నారు. నిరసనల్లో పాల్గొనే ప్రజలను హెచ్చరించారు గవర్నర్. మహసా అమినీ మరణాన్ని ప్రభుత్వ వ్యతిరేకులు ఇలాంటి ఘటనలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
కాగా శుక్రవారం నాడు, కుర్దిస్థాన్ ప్రావిన్స్కి చెందిన అమిని తన కుటుంబంతో కలిసి టెహ్రాన్లో పర్యటించింది. హిజాబ్ ధరించనందుకు కఠినమైన డ్రెస్ కోడ్ను అమలు చేసిన మోరాలిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని మహిళలు ఇంటి బయట హిజాబ్ లేదంటే వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే, అమిని పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. మరణానికి కారణం గుండెపోటు అని పోలీసులు తెలిపినప్పటికీ…కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులను శారీరకంగా హింసించడం వల్లే అమిని ప్రాణాలు కోల్పోయిందంటున్నారు. దీంతో ఇరాన్ లో ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి.