ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో విమానం 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. విమానాశ్రయం లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం సిబ్బంది.. పైలట్లను అలర్ట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వరుస ఫోన్ కాల్స్ కు పైలట్స్ స్పందించలేదు. చివరకు
విమానం ల్యాండ్ కావాల్సిన ఎయిర్ పోర్ట్ పాయింట్ ను దాటేసి వెళ్తున్నా.. పైలట్స్ లో ఉలుకు పలుకు లేదు. ఎందుకంటే వారిద్దరూ కమ్మటి నిద్రలోకి జారుకున్నారు.
ఏ మాత్రం తేడా జరిగినా.. ఇద్దరు పైలట్ల తో పాటు విమానంలోని ఎంతోమంది ప్రయాణికులు శాశ్వత నిద్రలోకి జారుకునే ముప్పు సైరన్ లా మోగింది.
ఎయిర్ పోర్ట్ పాయింట్ ను దాటేసి పోతుండగా.. ఆటో పైలట్ సిస్టమ్ డిస్కనెక్ట్ అయింది. దీంతో విమానంలో అలారం మోగింది.
పైలట్లు తటాలున నిద్ర నుంచి మేల్కొన్నారు. విమానాన్ని వెనక్కి తిప్పి.. అదృష్టవశాత్తు 25 నిమిషాలు ఆలస్యంగానైనా సేఫ్గానే ల్యాండ్ చేశారు.
సూడాన్ రాజధాని ఖార్టమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు వచ్చిన ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (బోయింగ్ 737) ఈ ముప్పు నుంచి గటెక్కింది. ఈ విమానంలో ఆటో పైలట్ సిస్టమ్ అద్భుతంగా పని చేసింది. 37 వేల ఎత్తులో విమానం ఉండగా.. పైలట్లు నిద్రపోయిన సమయంలో ఫ్లైట్ సుస్థిరంగా ప్రయాణించడానికి ఆటో పైలట్ సిస్టమ్ ఉపకరించింది. ఇక ఈ ఘటనను ఏవియేషన్ సర్వెలెన్స్ సిస్టమ్ ఏడీఎస్- బీ కూడా ధ్రువీకరించింది.
మే నెలలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. న్యూయార్క్ నుంచి రోమ్ బయల్దేరిన విమానం గాల్లో 38 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. పైలట్లు ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. పైలట్ల నిద్ర కారణంగా విమానం ల్యాండింగ్ మిస్సయిన ఘటనపై ఏవియేషనర్ రెగ్యులేటర్ విచారణ జరిపింది. ఎయిర్ బస్ 330 విమానం ఫ్రాన్స్ మీదుగా ఎగురుతున్న సమయంలో ఐటీఏ ఎయిర్వేస్కు చెందిన ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారని తేల్చింది