Attack On Pak : పాకిస్తాన్లో సోమవారం అర్ధరాత్రి మరోసారి ఉగ్రదాడి జరిగింది. టర్భత్ ప్రాంతంలోని పాక్ ఆర్మీకి చెందిన రెండో అతిపెద్ద నౌకాదశ ఎయిర్ స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్లోకి దుండగులు చొరబడి బాంబులు, హ్యాండ్ గ్రెనేడ్లు విసిరారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు మూడు గంటల పాటు ఈ ఉగ్రదాడి కొనసాగిందని తెలుస్తోంది.ఉగ్రవాదులను కడతేర్చేందుకు గంటల తరబడి పాక్ ఆర్మీ చెమటోడ్చాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆర్మీ ప్రతికాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని తెలిసింది. వారిలో నలుగురు చనిపోగా, మరో టెర్రరిస్ట్ పరారైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టర్బత్లో జిల్లా ఆరోగ్యాధికారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join
పాక్ ప్రభుత్వం ఈ దాడిపై(Attack On Pak) ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ ఉగ్రదాడికి తామే కారణమని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. తమ మిలిటెంట్లు పాక్ ఆర్మీ ఎయిర్ బేస్లోకి చొరబడి దాడి చేశారని వెల్లడించింది. ఈ దాడిలో డజనుకుపైగా పాక్ సైనికులను హత మార్చినట్టు తెలిపింది.టర్బత్లో బీఎల్ఏ దాడి చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. గతంలో మార్చి 20న గ్వాదర్లోని మిలిటరీ ఇంటలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది. ఆ ఘటనలో ఇద్దరు పాక్ సైనికులు, ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు.
పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ప్రావిన్స్లో చైనా పెట్టుబడులను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని వనరులను చైనా, పాకిస్తాన్లు దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. 2022లో పాకిస్తాన్ ప్రభుత్వం, నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రద్దయింది. ఆ తర్వాతి నుంచి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలలోనూ ఉగ్రదాడులు పెరిగాయి.