Indus Waters Treaty: నీటి కటకటతో ఉలిక్కి పడుతున్న పాకిస్థాన్‌!

‘రక్తం, నీరు కలిసి ప్రవహించవు’.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన వైఖరి ఇది. 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడ‌బ్ల్యూటీ) నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాక్‌ తీవ్ర ఆందోళన చెందుతోంది. అయితే, ఇలాంటి సంక్షోభాన్ని పాకిస్థాన్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా 78 ఏళ్ల క్రితం, 1948లో దేశ విభజన జరిగిన కేవలం 8 నెలలకే భారత్ నుంచి […]

Published By: HashtagU Telugu Desk
Pakistan reeling from a water crisis!

Pakistan reeling from a water crisis!

‘రక్తం, నీరు కలిసి ప్రవహించవు’.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న కఠిన వైఖరి ఇది. 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడ‌బ్ల్యూటీ) నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాక్‌ తీవ్ర ఆందోళన చెందుతోంది.

అయితే, ఇలాంటి సంక్షోభాన్ని పాకిస్థాన్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా 78 ఏళ్ల క్రితం, 1948లో దేశ విభజన జరిగిన కేవలం 8 నెలలకే భారత్ నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో దాయాది దేశం ఎలా విలవిల్లాడిపోయిందో చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఆనాటి ఘటనలే నేటి పాక్ భయాలకు పునాది వేశాయి.

1948 ఏప్రిల్ 1న ఏం జరిగింది?
1948 ఏప్రిల్ 1వ తేదీ ఉదయం, లాహోర్‌కు జీవనాధారమైన అప్పర్ బారీ దోఆబ్ కెనాల్ ఒక్కసారిగా ఎండిపోయింది. పశ్చిమ పంజాబ్ (పాకిస్థాన్) వ్యవసాయ క్షేత్రాలకు ప్రాణాధారమైన ఈ కాలువలో నీటి చుక్క కరవైంది. దీంతో పాక్‌ ప్రభుత్వం తీవ్ర భయాందోళనలకు గురైంది.

దేశ విభజన తర్వాత సింధు నదీ వ్యవస్థలోని కీలకమైన మాధోపూర్, ఫిరోజ్‌పూర్ హెడ్‌వర్క్‌లు భారత్ నియంత్రణలోకి వచ్చాయి. దీంతో పాకిస్థాన్ సాగు భూమిలో దాదాపు 5.5 శాతం ప్రాంతానికి నీరందించే కాలువలపై భారత్‌కు పూర్తి ఆధిపత్యం లభించింది. 1948 మార్చి 31తో ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక నీటి ఒప్పందం గడువు ముగియడంతో తూర్పు పంజాబ్ (భారత్) ముఖ్యమంత్రి గోపీచంద్ భార్గవ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది.

నెహ్రూ వ్యతిరేకించినా ఆగని పంజాబ్ ప్రభుత్వం
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నిర్ణయం భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది కాదు. తూర్పు పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చర్యకు పాల్పడింది. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

వ్యవసాయానికి నీటిని ఆపడం అమానవీయ చర్య అని, యుద్ధ సమయాల్లో తప్ప ఇలాంటి పనులు చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దేశ విభజన గాయాలు, స్థానిక వాస్తవాల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసింది. తమ భూభాగంలోని వనరులపై తమకే సార్వభౌమాధికారం ఉంటుందని వాదించింది. మరోవైపు పాక్‌ మాత్రం దీనిని కుట్రపూరిత చర్యగా అభివర్ణించింది.

పాక్ నిస్సహాయత
నీటి సరఫరా నిలిచిపోవడంతో పాకిస్థాన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి తలెత్తింది. లాహోర్ కాలువలు ఎండిపోయి, పంట పొలాలు బీటలు వారాయి. ఆ సమయంలో దాదాపు రూ.2 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా. అయినప్పటికీ పాక్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ప్రభుత్వం యుద్ధానికి దిగడం ఆచరణీయం కాదని గ్రహించింది. నదీ ప్రవాహానికి ఎగువన ఉన్న భారత్‌తో సైనిక ఘర్షణకు దిగితే అది తమకే తీవ్ర నష్టం కలిగిస్తుందని పాక్ గుర్తించింది. అందుకే చర్చల మార్గాన్ని ఎంచుకుంది.

సంక్షోభం నుంచి ఒప్పందం వైపు
దాదాపు 35 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయిన తర్వాత 1948 మే నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మే 5న భారత్ తిరిగి నీటిని విడుదల చేసింది. ఈ సంక్షోభం పాకిస్థాన్‌కు ఒక గుణపాఠం నేర్పింది. భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు సొంతంగా లింక్ కాలువలు నిర్మించుకోవడం ప్రారంభించింది.

ఈ సంఘటనే ద్వైపాక్షిక చర్చలు విఫలమవడంతో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వానికి దారితీసింది. పర్యవసానంగా 12 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత 1960లో ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌లపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు లభించాయి.

ఆనాడు 1948 సంక్షోభం ఒక శాశ్వత ఒప్పందానికి దారితీస్తే, నేడు అదే ఒప్పందాన్ని ఉగ్రవాద చర్యల కారణంగా భారత్ నిలిపివేయాల్సి వచ్చింది. 1948 నాటి భయాలు ఇప్పుడు పాకిస్థాన్‌ను మరోసారి వెంటాడుతున్నాయి.

  Last Updated: 10 Jul 2026, 10:22 AM IST