Ceasefire: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కాల్పుల విరమణ (సీజ్ఫైర్) కోరిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా “నిరాధారమైన, అబద్ధపు” మాటలని ఇరాన్ కొట్టిపారేసింది. రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, దానికి వాస్తవికతతో ఎటువంటి సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రభుత్వ టెలివిజన్ ద్వారా స్పష్టం చేశారు.
ఇరాన్లో అధికార మార్పు జరిగిందన్న ట్రంప్ ప్రకటనపై కూడా ఇరాన్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ అందరినీ “ఏప్రిల్ ఫూల్” చేస్తున్నారని, ట్వీట్ల ద్వారా ఒక దేశ అధ్యక్షుడు మారరని ఎద్దేవా చేసింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ.. మసూద్ పెజెష్కియాన్ గతంలోనూ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికీ ఆయనే ఆ పదవిలో కొనసాగుతున్నారని, ఇరాన్లో ఎటువంటి అధికార మార్పు జరగలేదని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న తప్పుదోవ పట్టించే ప్రకటనలని ఇరాన్ పేర్కొంది.
ట్రంప్ వాదనను తోసిపుచ్చిన ఇరాన్
అంతకుముందు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేస్తూ.. ఇరాన్ “కొత్త ప్రభుత్వం” తనను యుద్ధవిరామం కోసం అభ్యర్థించిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ నాయకత్వంలో ఎటువంటి మార్పు జరగలేదని నిర్ధారణ కావడంతో ట్రంప్ చేసిన ఈ క్లెయిమ్పై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే, తాము ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఇరాన్కు చెప్పినట్లు కూడా ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ దీనిని తీవ్రంగా ఖండించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి!
యుద్ధం ముగింపుపై సంకేతాలు
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం ‘అల్ జజీరా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు. ఇరాన్ ప్రజలను బెదిరించే ధోరణితో ఏ దేశం కూడా మాట్లాడకూడదని ఆయన హెచ్చరించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించవచ్చని, అవసరమైతే అమెరికా మళ్లీ రంగంలోకి దిగుతుందని అన్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని రాయిటర్స్ అడిగిన ప్రశ్నకు.. దానికి నిర్దిష్ట సమయాన్ని చెప్పడం సాధ్యం కాదని ఆయన సమాధానమిచ్చారు. అమెరికా చర్యల తర్వాత ఇరాన్ అణు సామర్థ్యం బలహీనపడిందని, అది అణు శక్తిగా మారే స్థితిలో లేదని ట్రంప్ వాదించారు.
యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. దీనిపై ట్రంప్ ఘాటుగా స్పందిస్తూ.. చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు అమెరికా నుండి చమురు కొనాలని లేదా “ధైర్యం ఉంటే” హోర్ముజ్ జలసంధి నుండి స్వయంగా తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు.
