అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు.
“చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చర్చలకు తగినంత సమయం తీసుకోవాలని మా అధికారులకు సూచించాను” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ డీల్ ఓ కొలిక్కి వచ్చేంత వరకు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత వంటి ప్రధాన అంశాలపై ఇరు దేశాల మధ్య ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ తాజా ప్రకటనతో ముడి చమురు రవాణా సాధారణ స్థితికి రావడం ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి పర్షియన్ గల్ఫ్ లో దాదాపు 2,000 నౌకలు చిక్కుకుపోయాయి. ఒకవేళ హర్మూజ్ జలసంధిని తెరిచినా, ఆ ప్రాంతంలో అమర్చిన సీమైన్స్ ను తొలగించడం, షిప్పింగ్ సంస్థలకు భద్రతపై నమ్మకం కలగడం వంటి అంశాల కారణంగా నౌకాయానం సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
