Kargil Plan : 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంతో ముడిపడిన కీలక విషయాలను పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. భారత్తో కార్గిల్ యుద్ధానికి నో చెప్పినందుకే ఆనాటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు చేసి తనను పదవీచ్యుతుణ్ని చేశాడని ఆయన ఆరోపించారు. శనివారం (డిసెంబర్ 9) లాహోర్లోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ప్రపోజల్ను 1999 కంటే ముందు ప్రధానమంత్రులుగా పనిచేసిన మరో ఇద్దరు ఎదుట కూడా ముషారఫ్ ప్రతిపాదించారు. చివరకు దాన్ని నేను ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఏకపక్షంగా, రహస్యంగా అమలు చేశారు. దానికి నా అనుమతి లభించలేదు’’ అని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ‘‘1999 ఫిబ్రవరిలో లాహోర్లో నేను, నాటి ఇండియా ప్రధానమంత్రి వాజ్పేయి శిఖరాగ్ర సమావేశం నిర్వహించాం. పాక్లో నేను.. ఇండియాలో వాజ్పేయి ప్రధానులుగా ఉన్న సమయంలోనే(1999 మేలో) న్యూఢిల్లీ – లాహోర్ మధ్య బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈవిధంగా ఇరుదేశాల మధ్య శాంతి కుసుమాలు చిగురిస్తున్న టైంలో ముషారఫ్ రహస్యంగా కార్గిల్ వార్కు ప్లాన్ చేశారు. నా అనుమతి లేకుండానే కార్గిల్కు సైన్యాన్ని తరలించారు’’ అని నవాజ్ వివరించారు.
‘‘భారత్తో కార్గిల్ యుద్ధం(Kargil Plan) చేయడం పెద్ద తప్పిదం అవుతుందని ఆనాడు నేను చెప్పాను. అయినా వినిపించుకోలేదు. ఆ తర్వాత నేను చెప్పిందే నిజమైంది’’ అని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో గెలిస్తే భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చైనాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఇండియాకు చేరువ కావాలని పాక్ భావిస్తోందని పేర్కొన్నారు.