45 People Burned Alive : ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్. ఆ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం దక్షిణ మంగాఫ్ జిల్లాలోని ఆరు అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వెంటనే అదుపులోకి రాకపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ భవనంలో నివసిస్తున్న దాదాపు 45 మంది(41 People Burned Alive) సజీవ దహనమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో దాదాపు 40 మంది భారతీయులేనని తెలుస్తోంది. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. జీవనోపాధి కోసం సొంతూళ్లను వదిలి వచ్చి.. కువైట్లోని ఓ కంపెనీలో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తూ పెద్దసంఖ్యలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ప్రమాదం జరిగిన టైంలో ఆ భవనంలో 160 మంది ఉన్నారని తెలిసింది. ఈ భవనంలోని ఓ కిచెన్ రూంలో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదం సంభవించిన భవనం కువైట్లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కువైట్లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.