Site icon HashtagU Telugu

Rs 2900 Crores : ట్రంప్‌కు 2900 కోట్ల జరిమానా.. ఆయన కొడుకులకూ కోట్లకొద్దీ ఫైన్.. ఎందుకు ?

Donald Trump

Donald Trump

Rs 2900 Crores : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కోర్టులు జరిమానాలు విధించే పర్వం కంటిన్యూ అవుతోంది. తాజాగా న్యూయార్క్‌లోని ఓ కోర్టు సివిల్ మోసం కేసులో ట్రంప్‌, ఆయన కంపెనీలకు రూ.2900 కోట్ల భారీ జరిమానా విధించింది. అంతేకాదు.. ట్రంప్ మూడేళ్లపాటు న్యూయార్క్ రాష్ట్రంలో ఆయన సొంత కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరించకుండా బ్యాన్ సైతం న్యాయస్థానం విధించింది.  ట్రంప్ కుమారులు, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ కూడా ఒక్కొక్కరు రూ.33 కోట్లు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ కుమారుడు సైతం రెండేళ్లపాటు వారి సొంత కంపెనీ బోర్డులో డైరెక్టర్లుగా విధులు నిర్వహించకుండా కోర్టు బ్యాన్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

తాజాగా వెలువడిన తీర్పుతో ముడిపడిన కేసులో విచారణ వాస్తవానికి జనవరిలోనే ముగిసింది. డొనాల్డ్ ట్రంప్, ఆయన ఇద్దరు కుమారులు తమ ఆస్తుల విలువను వందల మిలియన్ల డాలర్లు పెంచి చూపించారనే దర్యాప్తులో తేలడంతో వారందరికీ ఈమేరకు శిక్షలను విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మరోవైపు ట్రంప్, ఆయన కుమారులు తాము ఎటువంటి తప్పు చేయలేదని వాదిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో తనపై ఈవిధంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు.

పరువు నష్టం కేసులో.. రూ.685 కోట్ల పరిహారం 

పరువు నష్టం కేసులో జీన్ కారోల్ అనే ప్రముఖ జర్నలిస్టుకు రూ.685 కోట్ల (83 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించాలని డొనాల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ సిటీ కోర్టు మూడు వారాల క్రితం ఆదేశించింది. ట్రంప్ తన విశ్వసనీయతను దెబ్బతీశాడని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని జీన్ కారోల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. 1990లలో మాన్‌హట్టన్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని కారోల్ ‘వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్? ఎ మోడెస్ట్ ప్రొపజల్’ అనే పుస్తకంలో రాసుకున్నారు. దీనిని జూన్ 2019లో ‘న్యూయార్క్ మ్యాగజైన్’ ప్రచురించింది. అయితే ఇదంతా అసత్య ప్రచారమని, అత్యాచారం అవాస్తవమని ట్రంప్ ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని, కారోల్ ఒక అబద్ధాల కోరు అని ట్రంప్ విరుచుకుపడ్డారు. అసలు ఆమెను తాను ఎప్పుడూ కలవలేదని కూడా ఆయన ఖండించారు. అయితే 2019లో ట్రంప్ చేసిన తప్పుడు ప్రకటన తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని, మానసిక క్షోభకు కారణమైందని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. తన కెరీర్‌ను ట్రంప్ దెబ్బతీశారని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడింది నిజమని పేర్కొన్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ట్రంప్ తన పరువు తీశారని ఆరోపిస్తూ జనవరి 2022లో ఆమె ప్రత్యేక వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యూయార్క్ సిటీ కోర్టు జ్యూరీ శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ‘ఇవి అమెరికా కోర్టులు కావు’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ తీర్పుని ఉన్నతస్థాయి న్యాయస్థానంలో సవాలు చేస్తామని ట్రంప్ తరపు న్యాయవాది వెల్లడించారు.

Also Read :TSPSC Results : టీఎస్‌పీఎస్సీ ఆ ఆరు ఉద్యోగాల ఫలితాలు రిలీజ్

Exit mobile version