Israel Revenge : చాలా దశాబ్దాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తాజాగా హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ల మరణంతో మరోసారి ఇజ్రాయెల్ కుట్రకోణం తెరపైకి వచ్చింది. ఇద్దరు ఇరాన్ దిగ్గజ నేతల మరణాల వెనుక ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ హస్తం ఉందా ? అసలేం జరిగింది ?
We’re now on WhatsApp. Click to Join
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ కావడానికి ప్రతికూల వాతావరణమే కారణమా ? ఇజ్రాయెల్ (Israel Revenge) గూఢచార సంస్థ మోసాద్ పన్నిన కుట్ర వల్ల ఇలా జరిగిందా ? అనే కోణంలో ఇరాన్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై కథనాలను వండి వార్చుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇంకా ఏమీ లభ్యం కాలేదు. అజర్ బైజాన్ దేశ పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లిన ఇబ్రహీం రయీసీ, అమీర్ అబ్దుల్లాహియాన్లకు భద్రత కల్పించేందుకు తోడుగా మరో రెండు సైనిక హెలికాప్టర్లు వెళ్లాయి. అయితే ఆ రెండు సైనిక హెలికాప్టర్లు సేఫ్గా ఉండగా.. కేవలం ఇద్దరు దిగ్గజ నేతలున్న హెలికాప్టరే ఎందుకు కూలింది అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. దానికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఇలా చేసిందా ? అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. ఇజ్రాయెల్ పై దాడి చేయొద్దని ఇరాన్కు అమెరికా సూచించింది. అయితే అదంతా ఇరాన్ పట్టించుకోకుండా.. ఇజ్రాయెల్పై ఎటాక్ చేసింది. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూడా అమెరికా తయారు చేసిన ‘బెల్ 212’ మోడల్ హెలికాప్టర్. దీంతో రయీసీ మృతికి అమెరికా ఏదైనా కుట్ర చేసిందా? అనే డౌట్స్ తలెత్తుతున్నాయి. ఇబ్రహీం రయీసీ ప్రయాణించిన హెలికాప్టర్ను నడిపిన పైలట్ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు ఏజెంట్ అయి ఉండొచ్చంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ కుట్ర కథనాలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.