274 Palestinians Killed : ఇజ్రాయెల్ ఆర్మీ తమ దేశానికి చెందిన నలుగురు బందీలను విడిపించేందుకు సెంట్రల్ గాజాలో దారుణమైన ఆపరేషన్ నిర్వహించింది. ఈక్రమంలో 274 మంది సామాన్య పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలిగొంది. చనిపోయిన పాలస్తీనా పౌరుల్లో ఎంతోమంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. మరో 700 మంది పాలస్తీనావాసులు కూడా ఈ దాడుల్లో గాయాల పాలయ్యారు. పాలస్తీనా ఆరోగ్య విభాగం ఈవివరాలను ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఆపరేషన్లో తీవ్ర గాయాలపాలు కావడంతో చికిత్స కోసం తీసుకొచ్చిన వారితో గాజాలోని అల్-అఖ్సా ఆస్పత్రి నిండిపోయింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదివారం రోజు సెంట్రల్ గాజాలోని నుసీరాత్ శరణార్థి శిబిరంలోని రెండు వేర్వేరు అపార్ట్మెంట్లపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో హమాస్ మిలిటెంట్ల అదుపులో ఉన్న నలుగురు బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ విడిపించింది. అయితే ఆ నలుగురు బందీలను చేరుకునేందుకు కొన్ని గంటల పాటు మిలిటరీ ఆపరేషన్ను ఇజ్రాయెల్ ఆర్మీ చేయాల్సి వచ్చింది. ఎంతోమంది హమాస్ మిలిటెంట్లను దాటుకుంటూ.. బందీలను దాచిన ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఈక్రమంలో ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన విచక్షణారహిత దాడుల్లో 274 మంది సామాన్య పాలస్తీనా పౌరులు (274 Palestinians Killed) చనిపోయారు.
అయితే ఈ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ప్రయత్నించారు. ఇజ్రాయెలీ బందీలను రక్షించే సమయంలో తమ సైనిక బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని చెప్పారు. ఆ దాడులను తిప్పికొట్టేందుకు ప్రతిదాడి చేయడం తప్ప మరో మార్గం తమకు కనిపించలేదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో ఓ ఆర్మీ అధికారిని తాము కోల్పోయామన్నారు.
గత ఏడాది అక్టోబరులో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేసి.. 250 మంది ఇజ్రాయెలీలను కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబరులో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కొంతమంది బందీలను విడిచిపెట్టారు. ఇంకా 120 మంది ఇజ్రాయెలీ బందీలు హమాస్ చెరలో ఉన్నారు. వారిని గాజాలోనే దాచినట్టు అనుమానిస్తున్నారు. అయితే వారిని కాపాడటం ఇజ్రాయెల్కు పెద్ద సవాల్గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇజ్రాయెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు బందీలను కాపాడింది. అప్పట్లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 74 మంది గాజా పౌరులు చనిపోయారు.