Big Warning : తిండి, నీళ్లు లేక అల్లాడుతున్న గాజా ప్రజలకు ఇజ్రాయెల్ మరో పెద్ద వార్నింగ్ ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఉత్తర గాజా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది. తమ మాట వినకుండా ఒకవేళ ఉత్తర గాజాలోనే ఉంటే ప్రాణాలు ప్రమాదంలో పడతాయని వార్నింగ్ ఇచ్చింది. ఈమేరకు వార్నింగ్ తో కూడిన కరపత్రాలను యుద్ధ విమానాల ద్వారా గాజా ప్రాంతంలో జార విడిచింది. ఈ కరపత్రాల్లో ‘అర్జెంట్ వార్నింగ్’ అనే టైటిల్ పెట్టింది. ఉత్తర గాజాలోనే ఉండేవాళ్లను ఇకపై టెర్రరిస్టులుగా పరిగణించి, నేరుగా వారిపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సర్వం కోల్పోయిన లక్షలాది మంది గాజా ప్రజలు.. ఇప్పుడు ఈ కరపత్రాలను చూసి మరింత ఆందోళనలోకి జారుకున్నారు. పుట్టి పెరిగిన ఊరును ఉన్నఫలంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవించే హక్కును ఇజ్రాయెల్ కాలరాస్తోందంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోవైపు ప్రపంచదేశాలు గాజా సహాయార్ధం వందలాది ట్రక్కుల్లో సహాయక సామగ్రిని పంపారు. అయితే వాటిలో కేవలం కొన్నింటినే గాజాలోకి ఇజ్రాయెల్ పంపించింది. మిగతా వాటిని ఈజిప్టు – గాజా బార్డర్ లోనే ఆపేసింది. ఉత్తర గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ కు రెడీ అవుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరిన్ని ట్రక్కులను గాజాలోకి వెళ్లనివ్వబోమని (Big Warning) అంటోంది.
గాజా బార్డర్ లో 3.50 లక్షల మంది ఇజ్రాయెలీ సైనికులు, వందలాది యుద్ధ ట్యాంకులు రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్ ను ఏదైనా ఇతర అరబ్ దేశం అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిలువరించడానికి అమెరికా ఆర్మీ ఇజ్రాయెల్ సముద్రతీరంగా పాగా వేసి సిద్ధంగా ఉంది. ఇక యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. యూపీలోని ఘజియాబాద్లో ఉన్న హిండాన్ ఎయిర్ బేస్ నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్కి చెందిన సీ-17 ఫ్లైట్లో సహాయక సామగ్రిని గాజాకు భారత్ పంపింది. సహాయక సామగ్రిలో 6.5 టన్నుల మెడికల ఎయిడ్, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ ఉన్నాయి. ఈజిప్ట్లోని ఎల్ అరిష్ ఎయిర్ పోర్టుకు ఈ విమానం చేరుకోనుంది. అక్కడి నుంచి సహాయక సామగ్రి ప్రత్యేక ట్రక్కులో గాజాకు వెళ్తుంది.