Israel Vs Iran : సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసిన ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్ రెడీ అవుతోంది. ఇందుకు ఇరాన్ ఆర్మీ సరంజామాను సిద్ధం చేసుకుంటోందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ జంషిది ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘మేం ఇజ్రాయెల్పై దాడికి రెడీ అవుతున్నాం. ఈవిషయంలో అడ్డు రావొద్దని అమెరికాకు చెప్పాం. పక్కకు తప్పుకోవాలని సూచించాం’’ అని అందులో తెలిపారు. ‘‘మా సూచనను అమెరికా పరిగణనలోకి తీసుకుంది. సిరియాలోని అమెరికా లక్ష్యాలను తాకొద్దని మమ్మల్ని అమెరికా కోరింది” అని జంషిది చెప్పారు. అయితే ఈవిషయంపై అమెరికా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, లెబనాన్లోని తమ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా.. ఇజ్రాయెల్తో యుద్దానికి సిద్ధంగా ఉందని ఇరాన్ (Israel Vs Iran) హెచ్చరించింది.
We’re now on WhatsApp. Click to Join
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయబోతోందని.. దీనివల్ల ఇజ్రాయెల్లో ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో అనే ఆందోళనలో అమెరికా ఉందంటూ కథనాలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఇజ్రాయెల్లోని సైనిక, గూఢచార కార్యాలయాలపై ఇరాన్ దాడిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ దాడులను నేరుగా ఇరాన్ చేస్తుందా ? లెబనాన్లోని తన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ద్వారా దాడి చేస్తుందా ? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై దాడి చేసేందుకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా ఇజ్రాయెల్ తమకు తెలియజేయలేదని అమెరికా అంటోంది. ఇలాంటి ప్రకటనల ద్వారా పశ్చిమాసియా ప్రాంతంలోని తమ స్థావరాలపై ఇరాన్ దాడి చేయకుండా అగ్రరాజ్యం జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని పరిశీలకులు అంటున్నారు.
సిరియా రాజధాని డమస్కస్లోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఇద్దరు ఆర్మీ జనరల్స్ సహా కనీసం ఏడుగురు ఇరానియన్లు చనిపోయారు. ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే మొదటిసారి. ఈ దాడి చేసినప్పటి నుంచి హైఅలర్ట్లో ఉన్న ఇజ్రాయెల్.. తమ ఆర్మీకి సెలవులను రద్దు చేసింది. ఆయుధాలను దేశం అంతటా మోహరించింది. వాయుసేనను అప్రమత్తం చేసింది. దేశంపైకి ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు, మిస్సైళ్లకు అంతరాయం కలిగించడానికి GPS సిగ్నలింగ్ వ్యవస్థను తాత్కాలికంగా మూసేసింది. ప్రత్యేకించి రాజధాని టెల్ అవీవ్లో ఎన్నో కట్టుదిట్టమైన భద్రతాలను చర్యలను ఇజ్రాయెల్ చేపట్టింది.