20 Years Jail : ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. గర్ల్ఫ్రెండ్ను దారుణంగా హత్య చేసినందుకు అతగాడికి న్యాయస్థానం ఈ కఠిన శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల ఎం కృష్ణణ్ అనే భారత సంతతి వ్యక్తి సింగపూర్లో ఉంటాడు. అతడికి అప్పటికే పెళ్లయింది. భార్య కూడా ఉంది. అయినా మలికా బేగం అనే మరో యువతితో సంబంధం కొనసాగించే వాడు. ఈక్రమంలో ఇతర పురుషులతో మలికా బేగంకు సంబంధాలు ఉన్నాయేమోననే అనుమానం అతడిని ఆవరించింది. ఆ అనుమానంతో మలికా బేగంను కృష్ణణ్ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఓ రోజు ఆమెపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. గాయాల పాలైన మలికా బేగం అక్కడికక్కడే తనువు చాలించింది. ఈ ఘటన ఇప్పటిది కాదు. 2019 సంవత్సరంలో జనవరి 17న సింగపూర్లోనే మలికా బేగం మర్డర్ జరిగింది. నాటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుండగా తాజాగా కోర్టు తీర్పు వచ్చింది. మలికా బేగంను తానే హత్య చేశానని కృష్ణణ్ ఒప్పుకోవడంతో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలుశిక్షను(20 Years Jail) విధించింది. ఎం కృష్ణణ్ మొదటి నుంచీ సైకోలా ప్రవర్తించే వాడని.. భార్యను, గర్ల్ ఫ్రెండ్ను ఇద్దరిని కూడా వేధించేవాడని న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join
2015 నవంబరులో మలికా బేగంను కృష్ణన్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఇంటి బెడ్ రూంలో మద్యం సేవిస్తుండగా.. కృష్ణన్ భార్య చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కృష్ణన్ ఆమెకు గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. విస్కీ బాటిల్ చేతిలో పట్టుకొని దాడికి యత్నించాడు. దీంతో భయపడిన అతడి భార్య క్షమాపణ కోరింది. మరుసటి రోజు పోలీసుల దగ్గరికి వెళ్లి ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. అనంతరం ఎన్నడూ మలికా బేగం, కృష్ణన్ల అఫైర్కు అతడి భార్య ఆటంకం కలిగించలేదు. 2018 సంవత్సరంలో ఓ కేసు విషయంలో కృష్ణన్ జైలు పాలయ్యాడు. జైలు నుంచి కృష్ణన్ విడుదలయ్యాక.. అతడితో కలిసి మద్యం తాగుతూ మలికా బేగం ఓ కీలక విషయాన్ని చెప్పింది. కృష్ణన్ జైలులో ఉన్న టైంలో తాను పలువురు పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నానని తెలిపింది. దీంతో కృష్ణన్ కోపంతో రగిలిపోయాడు. నాటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 2019 జనవరి 15న మలికపై దారుణంగా దాడి చేసి పాశవికంగా కడతేర్చాడు.