Stock Market భారత కరెన్సీ రూపాయి చారిత్రక పతనంతో శుక్రవారం కుదేలైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 94.85 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమనడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి 0.9 శాతం నష్టంతో 94.81 వద్ద స్థిరపడింది. ఇది కూడా సరికొత్త ముగింపు కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఆసియా కరెన్సీలలోనే అత్యంత బలహీనమైన ప్రదర్శన రూపాయిదే. పశ్చిమాసియా సంక్షోభం మొదలైనప్పటి నుంచి రూపాయి విలువ 4 శాతం మేర పడిపోగా, ఈ త్రైమాసికంలో నష్టం 5.2 శాతంగా ఉంది.
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అడపాదడపా డాలర్లను విక్రయిస్తున్నప్పటికీ, మారకం విలువ మానసికంగా కీలకమైన 95 మార్కుకు చేరువవుతోంది. స్పాట్ మార్కెట్లో కాకుండా ఫార్వర్డ్ సెగ్మెంట్లో ఆర్బీఐ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నట్లు కరెన్సీ డీలర్లు చెబుతున్నారు. దీనివల్ల పతనం తాత్కాలికంగా వాయిదా పడుతోందే తప్ప, పూర్తిగా ఆగడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్ కూడా దాదాపు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. 10 ఏళ్ల బెంచ్మార్క్ బాండ్ యీల్డ్ 6.95 శాతానికి పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 850 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించారు. ఈ నెలలో స్టాక్ మార్కెట్ల నుంచి 11.5 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 109.75 డాలర్లకు పెరగడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వంటివి రూపాయిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి.
