Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరిక ఇచ్చిన కొద్ది రోజులకే ఈ స్పందన వచ్చింది.
మరోవైపు వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి అదే రోజు మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత వైమానిక దాడుల్లో అమెరికాకు చెందిన ఎఫ్-16 జెట్లతో సహా కనీసం పదిహేను పాకిస్థాన్ సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. భారత వైమానిక దాడుల్లో జరిగిన నష్టం గురించి ఇస్లామాబాద్ చేస్తున్న వాదనలను ఆయన కల్పిత కథలుగా అభివర్ణించారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ పౌరులను రక్షించడానికి, దేశ సమగ్రతను కాపాడటానికి అవసరమైతే ఏ సరిహద్దునైనా దాటగల సత్తా భారతదేశానికి ఉందని రుజువైందని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడి, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ వంటి చర్యలను ఆయన అందుకు ఉదాహరణలుగా ఉదహరించారు. అంతకుముందు రోజు సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే.. అది చరిత్రను, భౌగోళిక అంశాలను మార్చగల నిర్ణయాత్మక ప్రతిస్పందనను ఆహ్వానిస్తుందని రక్షణ మంత్రి హెచ్చరించారు. సర్ క్రీక్ అనేది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్, పాకిస్థాన్ల మధ్య ఉన్న 96 కిలో మీటర్ల పొడవైన సముద్రపు అంచు. ఇది సరిహద్దు రేఖల విషయంలో రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా పరిగణించబడుతోంది.
