Site icon HashtagU Telugu

Bangladesh Protests : సుప్రీంకోర్టును చుట్టుముట్టిన బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు.. ఎందుకు ?

Bangladesh Protests Supreme Court

Bangladesh Protests : బంగ్లాదేశ్‌లో విద్యార్థులు మళ్లీ నిరసనకు దిగారు. ఈసారి వారు న్యాయవ్యవస్థలోని కీలక పదవుల్లో ఉన్నవారిని లక్ష్యంగా ఎంచుకున్నారు.  ఇందుకోసం ఇవాళ సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జిలు రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకునే సరికే.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు తాజాగా సమావేశానికి పిలుపునిచ్చారు. అందువల్లే బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టును చుట్టుముట్టాయి. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అవి వాస్తవమా ? కాదా ? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

We’re now on WhatsApp. Click to Join

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం విద్యార్థి సంఘాలు(Bangladesh Protests) అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఎదిగాయి. వారి ఆహ్వానం మేరకు మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ చేపట్టారు. స్వయానా ఆర్థికవేత్త కూడా అయిన యూనుస్ రాకతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పురోగతి పరుగులు తీస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు గంపెడు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో .. ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయమూర్తులతో ఫుల్ కోర్టు సమావేశాన్ని నిర్వహించడం బంగ్లాదేశ్‌లో కలకలం రేపింది.

Also Read :Team India: 40 రోజుల‌పాటు రెస్ట్ మోడ్‌లో టీమిండియా.. సెప్టెంబ‌ర్‌లో తిరిగి గ్రౌండ్‌లోకి..!

బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం 90 రోజుల్లోగా మళ్లీ  ఎన్నికలు  నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ? షేక్ హసీనాకు చెందిన  అవామీ లీగ్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారా ? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. ఇక బంగ్లాదేశ్ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో టీ20 మహిళల వరల్డ్ కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లో ప్లేయర్ల భద్రత ప్రశ్నార్ధకంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లు సెప్టెంబర్ 27 నుంచి మొదలు కానున్నాయి. ప్లేయర్ల  భద్రతకు ౌహామీ ఇవ్వాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరుతోంది. దీనిపై మధ్యంతర ప్రభుత్వం, బంగ్లాదేశ్ ఆర్మీ ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.