Site icon HashtagU Telugu

UN Security Council: భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మరో దేశం మద్దతు..!

Unsc Debate Pti 1138703 1661423833

Unsc Debate Pti 1138703 1661423833

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి వీటో సభ్యుల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్ తర్వాత, ఫ్రాన్స్ భారతదేశానికి మద్దతు ఇచ్చింది. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్, బ్రెజిల్‌లకు కొత్త శాశ్వత సీట్ల ఏర్పాటుకు తన మద్దతును అందించింది.

భద్రతా మండలి సంస్కరణలపై UNSC వార్షిక చర్చను ఉద్దేశించి UNలో ఫ్రాన్స్ డిప్యూటీ ప్రతినిధి నథాలీ బ్రాడ్‌హర్స్ట్ ఎస్టివాల్ మాట్లాడుతూ.. జర్మనీ, బ్రెజిల్, భారతదేశం, జపాన్ అభ్యర్థిత్వాలకు ఫ్రాన్స్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న, స్వీకరించదగిన దేశాల ఆవిర్బావాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలని ఆమె సమావేశంలో పేర్కొన్నారు. కొత్త ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలను గుర్తించి, వాటికి మండలిలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఫ్రాన్స్‌ పేర్కొంది. భద్రతా మండలిలో 25 సభ్య దేశాలు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించింది.

నథాలీ మాట్లాడుతూ.. భౌగోళిక ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి అనేక సీట్లు పంపిణీ చేయాలి. కాబట్టి కౌన్సిల్‌లోని శాశ్వత సభ్యులతో సహా ఆఫ్రికన్ దేశాల నుండి మరింత ఎక్కువ ప్రాతినిధ్యం కావాలి. వీటో అంశం అత్యంత సున్నితమైనదని తెలిపారు. అంతకుముందు యుఎన్‌ఎస్‌సిలో శాశ్వత సభ్యత్వం కోసం యుకె కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చింది. బ్రిటన్ రాయబారి బార్బరా ఉడ్‌వార్డ్ మాట్లాడుతూ.. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌లతో పాటు కౌన్సిల్‌లో కొత్త శాశ్వత సీట్ల ఏర్పాటు కోసం మేము ఎదురుచూస్తున్నామన్నారు.