ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ప్రావిన్స్ లో కురిసిన భారీవర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడటంతో 42 మంది మృతిచెందారు. మరో 16మంది గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ప్రావిన్స్ లో వరద పరిస్థితి దారుణంగా ఉందని..దీంతో ప్రజలు ఇళ్లల్లో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
మాగ్విండనావో ప్రావిన్స్ లోని మూడు నగరాలు వరదధాటికి ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి, శిథిలాల్లో ఇరుక్కోవడంతో చాలా మంది మరణించారని అధికారులు తెలిపారు. ఫిలిఫ్పీన్స్ మంత్రి సినారింబో మాట్లాడుతూ..రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీగా వరదలు రావడంతో నదులు పొంగిపొర్లాయి. దీంతో వరదలు వచ్చాయి. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గింది. పలు నగరాల్లో వరద కూడా తగ్గినట్లుగా తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించేందుకు సైన్యం, పోలీసులు రంగంలోకి దిగినట్లు మాగ్విందనావో ప్రావిన్షియల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అధికారి నస్రుల్లా ఇమామ్ తెలిపారు.