Ashwin Ramaswami : భారత సంతతికి చెందిన 24 ఏళ్ల యువతేజం అశ్విన్ రామస్వామి అమెరికాలోని జార్జియా రాష్ట్ర సెనేట్కు పోటీ చేస్తున్నారు. జార్జియా రాష్ట్రంలోని 48వ జిల్లా నుంచి ఆయన రాష్ట్ర సెనేట్ ఎన్నికల బరిలోకి దిగారు. అమెరికాలో రాష్ట్ర శాసనసభకు పోటీ చేస్తున్న మొదటి Gen Z భారతీయ-అమెరికన్ ఈయనే కావడం విశేషం. తాజాగా అశ్విన్ రామస్వామి ఎన్నికల ప్రచారం కోసం రూ.2.33 కోట్ల విరాళాలను సేకరించారు. అమెరికాలో ఒక రాష్ట్ర స్థాయి ఎన్నిక కోసం ఇంత భారీగా విరాళాలను సేకరించగలగడం చాలా పెద్ద విషయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జార్జియా రాష్ట్రంలోని 48వ జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధిక విరాళాలు అశ్విన్ రామస్వామికే రావడం గమనార్హం. 2023 సంవత్సరం నుంచి ఈ జిల్లా నుంచి జార్జియా రాష్ట్ర సెనేట్కు షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి షాన్ స్టిల్ పోటీ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్యకాలంలో అశ్విన్ రామస్వామి రూ.1.21 కోట్ల విరాళాలను సేకరించగా.. ఇదే వ్యవధిలో షాన్ స్టిల్కు కేవలం రూ.5.30 లక్షల విరాళాలే వచ్చాయి. తాజా పబ్లిక్ క్యాంపెయిన్ ఫైనాన్స్ రిపోర్ట్ ప్రకారం విరాళాల విషయంలో ఈ సెనేట్ స్థానంలో రామస్వామి ముందంజలో ఉన్నాడు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అతడి చేతిలో ఎక్కువ విరాళాలు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
అశ్విన్(Ashwin Ramaswami) ప్రత్యర్థి, ప్రస్తుత సెనేటర్ షాన్ స్టిల్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. 2020 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాన్ని షాన్ స్టిల్ ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అశ్విన్కే ఓటు వేయాలని డెమొక్రటిక్ పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
రామస్వామి గతంలో స్థానికంగా ఉద్యోగాలను క్రియేట్ చేయడం కోసం లాభాపేక్షలేని సంస్థలు, స్టార్టప్లు, చిన్న వ్యాపారాలతో కలిసి పనిచేశారు. గతంలో ఆయన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA)లో సేవలు అందించారు. 2020, 2022 ఎన్నికలను సురక్షితంగా ఉంచడానికి రాష్ట్ర, స్థానిక ఎన్నికల కార్యాలయాలతో కలిసి పనిచేశారు. జార్జియా అటార్నీ జనరల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ విభాగంలో లీగల్ ఫెలోగా కూడా అశ్విన్ పనిచేశారు.