దక్షిణాఫ్రికా (South Africa) బోక్స్బర్గ్ ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరో 40 మంది (40 injured)కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బ్రిడ్జ్ కింద ట్యాంకర్ ఇరుక్కుపోయింది. దాంతో గ్యాస్ ట్యాంక్పై ఒత్తిడి అధికమవడంతో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడుతో బ్రిడ్జ్ పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించారు. జోహన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్లోని టాంబో మెమోరియల్ హాస్పిటల్ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: China: చైనాలో కూలిన బంగారు గని.. చిక్కుకున్న 18 మంది మైనర్లు
టాంబో మెమోరియల్ హాస్పిటల్కి 100 మీటర్ల దూరంలో ఎత్తు తక్కువగా ఉన్న ఓ వంతెన కింద లిక్విడ్ పెట్రోలియం గ్యాస్తో వెళ్తున్న ఇంధన ట్యాంకర్ ఇరుక్కుపోయింది. అక్కడ ఏర్పడిన ఘర్షణ కారణంగా అది పేలిపోయింది. పేలుడు ధాటికి ఆస్పత్రి పై కప్పు కొంత భాగం కూలిపోయింది. పక్కన ఉన్న రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పుతున్న క్రమంలో రెండవ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఘటనాస్థలంలోనే 10 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది