Drone Strike : ఇజ్రాయెల్ దేశంతో అనుబంధమున్న నౌకలపై దాడుల పరంపర చివరకు ఇండియా సముద్ర తీరానికి కూడా చేరింది. గుజరాత్లోని సముద్ర తీరానికి తీరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్కు చెందినదిగా భావిస్తున్న ఒక నౌకపై శనివారం డ్రోన్ ఎటాక్ జరిగింది. ఇది ఎవరు చేశారు ? అనే దానిపై హాట్ డిస్కషన్ జరుగుతున్న తరుణంలో అమెరికా రక్షణశాఖ విభాగం పెంటగాన్ కీలక ప్రకటన చేసింది. ఆ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని ఆరోపించింది. ఆ నౌక ఇజ్రాయెల్ది కాదని.. జపాన్ కంపెనీకి చెందిన ఆ షిప్ను ఒక డచ్ సంస్థ నిర్వహిస్తోందని పెంటగాన్ వెల్లడించింది. అయితే అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇందుకు భిన్నంగా కథనం ప్రచురించింది. MV కెమ్ ప్లూటో అనే పేరు కలిగిన ఆ షిప్ డచ్ కంపెనీదే అయినప్పటికీ.. ఇజ్రాయెలీ షిప్పింగ్ తైకూన్ ఇడాన్ ఓఫెర్కు ఆ కంపెనీలో వాటాలు ఉన్నాయని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ డ్రోన్ దాడిలో(Drone Strike) MV కెమ్ ప్లూటో నౌకలోని ప్రయాణికులు ఎవరికీ ఏమీ కాలేదు. భారత నేవీ వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేయడంతో పెనుముప్పు తప్పింది. MV కెమ్ ప్లూటో నౌక సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వస్తుండగా దానిపై డ్రోన్ ఎటాక్ జరిగిందని పేర్కొంది. ఇరాన్ ఆర్మీలోని ఒక ఉన్నతాధికారి ఇటీవల మాట్లాడుతూ.. హమాస్తో ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ఆపకపోతే దాన్ని సముద్ర జలమార్గాలన్నీ మూసేస్తామని హెచ్చరించారు.
ఈక్రమంలోనే ఇరాన్ సపోర్ట్ కలిగిన యెమన్ హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వైపుగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తేనే నౌకలను వదిలేస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు లెబనాన్లోని ఇరాన్ సపోర్టు కలిగిన హిజ్బుల్లా గ్రూపు కూడా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఈవిధంగా నలువైపుల నుంచి దాడులను ఇజ్రాయెల్ ఎదుర్కొంటోంది. ఫలితంగా ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు, దిగుమతులు చాలా దెబ్బతిన్నాయి.