Site icon HashtagU Telugu

Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

Sri Lanka

Sri Lanka

దిత్వా తుపాను శ్రీలంకను పెను విధ్వంసం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. దిత్వా ధాటికి శ్రీలంక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, రైళ్లను నిలిపేశారు. ఈ సమయంలో శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోహరించింది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండురోజుల్లో ఈ దిత్వా తుపాను భారత్‌ను తాకనుంది.

దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 56 మంది మృతి చెందారు. తుపాను కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి ఒకే చోట 25 మందికి పైగా మరణించారు. దాదాపు 600 ఇళ్లు దెబ్బతినగా.. 21 మంది గల్లంతయ్యారు. శ్రీలంకలో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. శ్రీలంకవ్యాప్తంగా రైలు సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం శ్రీలంక ఉన్న ఆపద సమయంలో భారత్ ఆపన్నహస్తం అందించింది. సహాయక చర్యల కోసం కొలంబోలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నుంచి హెలికాప్టర్లను పంపించింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా శ్రీలంకవ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించిన వారి సంఖ్య 56కి పెరిగింది. ఇందులో మరో 21 మంది గల్లంతయ్యారు. 600కు పైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీలంక ప్రభుత్వ విపత్తుల నిర్వహణ కేంద్రం ప్రకారం.. మధ్య ప్రాంతంలోని టీ ఉత్పత్తి కేంద్రాలైన బదుల్లా, నువారా ఏలియా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి 25 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లను మూసివేయాలని శ్రీలంక ప్రభుత్వం ఆదేశించింది.

శ్రీలంకలోని చాలా నదులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కెలానీ నది పరీవాహక ప్రాంతంలోని కొలంబోతో సహా లోతట్టు ప్రాంతాలకు రాబోయే 48 గంటల్లో రెడ్ లెవల్ ఫ్లడ్ వార్నింగ్ జారీ చేశారు. శుక్రవారం ఒక్కరోజే 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది.

కొండచరియలు విరిగిపడటం.. బురద, చెట్లు రోడ్లు, రైలు మార్గాలపై పడటంతో పలు ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయి. అత్యవసర సేవలు మినహా రైలు సర్వీసులు అన్నింటినీ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రద్దు చేశారు. దాదాపు 20,500 మంది సైనిక సిబ్బందిని సహాయక చర్యల కోసం శ్రీలంక ప్రభుత్వం మోహరించింది.

దిత్వా తుఫాను శ్రీలంకలో సృష్టించిన తీవ్ర విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. దిత్వా తుఫాను కారణంగా తమ వారిని కోల్పోయిన శ్రీలంక ప్రజలకు తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మరోసారి శ్రీలంకకు భారత్.. మొట్టమొదటి సహాయకారిగా నిలిచింది. దిత్వా తుపాను బీభత్సం కారణంగా శ్రీలంక సహాయం కోరగా.. ప్రస్తుతం కొలంబోలో డాక్ చేసి ఉన్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి తక్షణమే సహాయక, రెస్క్యూ ఆపరేషన్ల కోసం హెలికాప్టర్లను పంపించారు.

ఈ ఆపత్కాలంలో అండగా నిలిచినందుకు భారత్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు శ్రీలంక ప్రభుత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. ఇక ఈ దిత్వా సైక్లోన్.. ఈనెల 30వ తేదీన భారత్‌ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది.

Exit mobile version