China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా..

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 09:38 PM IST

China: భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా.. ఇప్పటికే భారత్ గస్తీ పాయింట్లను హస్తగతం చేసుకుంది. తాజాగా భారత్, చైనాల మధ్య పరిస్థితి గురించి వచ్చిన ఓ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది. భారత్, చైనాల మధ్య రానున్న రోజుల్లో మరిన్ని ఘర్షణలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఆ నివేదిక చెబుతోంది.

డీజీపీల సదస్సులో సమర్పించిన నివేదికలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా చైనా స్థావరాలు పెంచుకుంటూ వస్తోందని.. ఈ నేపథ్యంలోనే భారత్-చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరుగొచ్చు అని నివేదికలో తేల్చడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నివేదికను విశ్లేషిస్తు ఓ అంతర్జాతీయ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది.

‘ఈ ప్రాంతంలో తమ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మౌళిక సదుపాయాలను ముమ్మరంగా చేపడుతోంది కొన్నేళ్లుగా జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలను విశ్లేషిస్తే.. 2013-14 తర్వత ప్రతి రెండు, మూడేళ్లకు వీటి తీవ్రత మరింత పెరిగింది. ఇలా ఇరు దేశాల సైనిక శక్తుల మధ్య ఘర్షణలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి’ అని నివేదికలో పేర్కొనడం జరిగింది.

భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రతా దళాల నుంచి నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. చైనా అవలంభిస్తున్న సరిహద్దు వ్యూహం ఫలిస్తోందని, అందులో భాగంగానే సరిహద్దు రేఖ వెంబడి దళాలను, స్థావరాలను చైనా పెంచుకుంటూ వస్తోందని నివేదిక తెలిపింది. దీని వల్లే లద్దాఖ్ లో చాలా గస్తీ పాయింట్లను భారత్ కోల్పోయిందని వివరించింది. కాగా 2020లో తూర్పు లద్దాఖ్ లో జరిగిన ఘర్షణల్లో 24 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.