China Floods: చైనాలోని హెబీ ప్రావిన్స్లో వరదలు (China Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ వరదల కారణంగా ఇప్పటివరకు 29 మంది చనిపోయారు. దీనితో పాటు హెబీలో వరదల కారణంగా 16 మంది అదృశ్యమయ్యారు. వీరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. చైనా అధికారిక మౌత్పీస్ గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ప్రాంతంలో ఇటీవలి వారాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీనివల్ల వరదలు లాంటి పరిస్థితి ఏర్పడింది.
హెబీ ప్రావిన్స్లో విపత్తుల కారణంగా ఆగస్టు 10 వరకు 29 మంది మరణించారని అధికారులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. నివేదిక ప్రకారం.. ప్రకృతి విపత్తు కారణంగా చైనాలోని హెబీ ప్రావిన్స్ సుమారు 95.811 బిలియన్ యువాన్ల నష్టాన్ని చవిచూసింది. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని 17 లక్షల మందిని ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నివేదిక పేర్కొంది. దీనితో పాటు వరదల వల్ల సంభవించిన నష్టం తరువాత, పునర్నిర్మాణ పనులకు సుమారు రెండేళ్లు పట్టవచ్చని అంచనా.
ప్రకృతి విపత్తు
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, వరద బాధితులు, వారి బాధిత కుటుంబాలకు ప్రాంతీయ అధికారులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెబీ ప్రావిన్స్లో తాత్కాలిక వైస్ గవర్నర్ జాంగ్ చెంగ్జోంగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హెబీ ప్రావిన్స్లో వరద పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర విపత్తు పరిస్థితి నెలకొంది.
అప్రమత్తమైన అధికారులు
చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ శుక్రవారం విపత్తు నివారణ, ఉపశమనం కోసం అదనంగా 1.46 బిలియన్ యువాన్లను కేటాయించినట్లు గ్లోబల్ టైమ్స్ నివేదించింది. ప్రావిన్స్లో వరద ప్రారంభమైనప్పటి నుండి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. వరదల కారణంగా ఆ ప్రాంతంలోని అనేక ఇళ్లు, భవనాలు ముంపునకు గురయ్యాయి. దీంతో పాటు పలు దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో కూడా నీరు నిండిపోయింది. హెబీలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ వ్యవస్థ కూడా స్తంభించింది.