115 People Dead : గత శుక్రవారం నుంచి ఇప్పటిదాకా చిలీ దేశాన్ని కార్చిచ్చు వణికిస్తూనే ఉంది. అడవుల్లో రేగిన కార్చిచ్చు వల్ల మరణించిన వారి సంఖ్య 115కు పెరిగింది. వేలాది మంది గాయపడ్డారు. గాయాలతో ఆస్పత్రుల్లో చేరినవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 1,700 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలిబూడిదైంది.
వియా డెల్ మార్ పట్టణం అగ్నివలయంలో చిక్కుకుంది. వియా డెల్ మార్లో దాదాపు 200 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. వియా డెల్ మార్ పట్టణం ఉన్న వల్పరైజో రీజియన్ గవర్నర్ రోడ్రిగో కార్చిచ్చులపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా ఉందని తెలిపారు. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీస్తామన్నారు. ఒక్క వల్పరైసో ప్రాంతంలోనే అటవీ కార్చిచ్చు కారణంగా 51 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దేశం తీవ్ర అపాయకర పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
నాగర్కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో గత బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్టు అధికారులు అంచనా వేశారు.అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. కొండపై అడవిలో మంటలు చెలరేగడం, ఆయా ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం వల్ల మంటలను అదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది. ఈ అగ్నిప్రమాదంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులతో ఆరా తీశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు నల్లమల అటవీ ప్రాంతంలోని జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.