UK Prime Minister Rishi Sunak : బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో శిశు సంరక్షణ, ఆయాలకు ప్రోత్సాహకాలకు ఇచ్చే ఓ విధానాన్ని ప్రకటించారు. దీని వల్ల ఆయన భార్య అక్షత మూర్తికి వాటాలు ఉన్న ఓ చైల్డ్కేర్ సంస్థకు ప్రయోజనం లభిస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై బ్రిటన్ పార్లమెంటుకు చెందిన కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ ఏప్రిల్ 13న దర్యాప్తును ప్రారంభించింది. ఈనేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాన మంత్రి రిషి సునక్ (Rishi Sunak) యొక్క మంత్రిత్వ ప్రయోజనాల రిజిస్టర్ను UK క్యాబినెట్ కార్యాలయం బుధవారం ప్రచురించింది. గత నెల బడ్జెట్లో తీసుకొచ్చిన పాలసీ వల్ల ప్రయోజనం పొందుతుందనే అభియోగాలను ఎదుర్కొంటున్న పిల్లల సంరక్షణ ఏజెన్సీలో ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి యొక్క వాటాల వివరాలను వెల్లడి చేసింది.
దీని ప్రకారం.. ప్రధానమంత్రి భార్య వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్. ఆమె వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పేరు కాటమరాన్ వెంచర్స్ యుకె లిమిటెడ్. ఆమె అనేక డైరెక్ట్ షేర్హోల్డింగ్లను కూడా కలిగి ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటు లైజన్ కమిటీ ఛైర్కు ప్రధానమంత్రి ఏప్రిల్ 4న లేఖ రాసి.. కోరు కిడ్స్ కంపెనీలో అతని భార్య కలిగి ఉన్న మైనారిటీ వాటాల గురించి చెప్పారని మంత్రిత్వ ప్రయోజనాల రిజిస్టర్ లో ప్రస్తావించారు. రిషి సునక్ (Rishi Sunak) అన్ని వేళలా మంత్రివర్గ ప్రవర్తనా నియమాలను పాటిస్తున్నారని అందులో పేర్కొన్నారు.ఇంగ్లాండ్లోని ఆరు పిల్లల సంరక్షణ సేవల ఏజెన్సీలలో ఒకటి కోరు కిడ్స్.
రిషి సునాక్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. తాము దర్యాప్తునకు సంతోషంగా సహకరిస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తామని చెప్పారు.హౌస్ ఆఫ్ కామన్స్ ప్రవర్తన నియమావళి, రిజిస్టర్లు సక్రమంగా ఉండేలా పర్యవేక్షించే బాధ్యత కమిషనర్దే. ఏమైనా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై కూడా దర్యాప్తు జరుపుతారు. ప్రవర్తన నియమావళి ప్రకారం పార్లమెంటు సభ్యులు తమకుగల ఆర్థిక ప్రయోజనాల గురించి వెల్లడించవలసి ఉంటుంది. ఈ ప్రయోజనాల వల్ల పార్లమెంటు సభ్యునిగా తన చర్యలు ప్రభావితమవుతాయని, పార్లమెంటులో ప్రసంగాలు లేదా ఓటు వేసే తీరును ప్రభావితం చేయవచ్చునని ఇతరులు భావించే అవకాశం ఉండవచ్చు.
అటువంటి సందర్భాల్లో తమకుగల ఆర్థిక ప్రయోజనాలను ఎంపీలు వెల్లడించవలసి ఉంటుంది. ఈ దర్యాప్తులో రిషి సునాక్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కమిషనర్ గుర్తిస్తే, క్షమాపణ చెప్పాలని ఆయనను ఆదేశించవచ్చు. భవిష్యత్తులో అటువంటివి జరగకుండా సూచనలు చేయవచ్చు. మరింత తీవ్రమైన కేసులను ఓ కమిటీకి నివేదించే అవకాశం ఉంటుంది. ఆ కమిటీ అవసరమైతే ఇతర ఆంక్షలను విధిస్తుంది. మౌఖిక లేదా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని కోరవచ్చు. జీతాన్ని నిలిపేయడం, సభ నుంచి కొంత కాలం సస్పెండ్ చేయడం, బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోవచ్చు.
Also Read: Army Officer: ఈ డిగ్రీ ఉంటే.. మీరే ఆర్మీ ఆఫీసర్.. నెలకు రూ. 2.50 లక్షల జీతం