Bomb Blast : పాకిస్తాన్లో బాంబుదాడుల మోత ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట బాంబుదాడులు, తుపాకీ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా సోమవారం పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు చనిపోగా, 22 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలోని బజౌర్ జిల్లా మాముంద్ తహసీల్లో ఈఘటన చోటు చేసుకుంది. పోలీసులు పోలియో టీకా బృందాలతో కలిసి వ్యానులోకి ఎక్కిన వెంటనే, దానిపైకి ఉగ్రవాదులు బాంబులు విసిరారు. దీంతో వ్యాన్ పేలిపోయి మంటలు ఎగిసిపడ్డాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు ఎవరు కారణం అనే వివరాలు తెలియరాలేదు. ఉగ్రవాదులు బాంబు విసిరిన టైంలో వ్యానులో 25 మంది ఉన్నారని(Bomb Blast) తెలిసింది.
ఈ ఘటనపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షన్ హుస్సెన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ‘‘చిట్టచివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకు.. ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుంది’’ అని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. ‘‘ఇలాంటి దాడులతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసిన ఈ ప్రాణ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది’’ అని చెప్పారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్లో బాంబు దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. పోలీసు సిబ్బందిపైనా దాడులు ఎక్కువ అవుతున్నాయి. గత నవంబర్లో పాకిస్థాన్లోని టాంక్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మరణించారు. ఓ మహిళను కిడ్నాప్ చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు వెళుతుండగా ఆ దాడి జరిగింది!
ఇక ఆదివారం రోజు పాకిస్తాన్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా సేవలు బంద్ అయ్యాయి. ఇన్ స్టా గ్రామ్, X(గతంలో ట్విట్టర్ ), Faceboll, Tik Tok, స్ట్రీమింగ్ దిగ్జజం YouTube తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు పనిచేయలేదు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI ఎన్నికల నిధుల సేకరణ కార్యక్రమం టెలిధాన్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ దుస్సాహసానికి పాల్పడించదని ఆ పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఆదివారం( జనవరి 7) రాత్రి 9 గంటలకు వర్చువల్ ఫండ్ రైజింగ్ టెలిథాన్ , మ్యానిఫెస్టో విడుదలను ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI తలపెట్టింది. ఈనేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీకి నిధుల సేకరణను అడ్డుకునేంకుందుకే ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలా చేయించిందని PTI పార్టీ నాయకులు, మద్దతుదారులు విమర్శించారు.