Kohinoor and 4 Items: బ్రిటీషర్లు కొల్లగొట్టిన “పంచ” అద్భుతాలు.. తిరిగి ఇచ్చేది లేదంటున్న తెల్ల దొరలు!!

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఎట్టకేలకు వందల ఏళ్ల తర్వాత అస్తమించింది. కానీ బ్రిటీష్ వాళ్ళు చేసిన అరాచకాలు..

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 08:15 AM IST

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఎట్టకేలకు వందల ఏళ్ల తర్వాత అస్తమించింది. కానీ బ్రిటీష్ వాళ్ళు చేసిన అరాచకాలు.. నేటికీ భారత్ సహా ఎన్నో ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు గుర్తున్నాయి. బ్రిటీష్ తెల్ల దొరలు నయానో భయానో ఎంతో విలువైన బంగారు, వజ్ర ఆభరణాలను, చారిత్రక అవశేషాలను కొల్లగొట్టి తీసుకుపోయారు. వీటిలో చాలా వస్తువులు బ్రిటీష్ రాజ కుటుంబం బీరువాలో ఉండగా.. మిగిలినవి లండన్ లోని బ్రిటీష్ నేషనల్ మ్యూజియంలో ఉన్నాయి. ఇలా బ్రిటీష్ వాళ్ళు కొల్లగొట్టిన 5 అత్యంత విలువైన వస్తువుల్లో మన ఇండియాకు చెందిన కోహినూర్ వజ్రంతో పాటు మరో నాలుగు ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

కోహినూర్‌ కథ..

బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు ఏలిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 కన్నుమూశారు. ఐతే ఎలిజబెత్‌-2 తర్వాత కోహినూర్‌ ఎవరి సిగలో అలంకరించనున్నరనే విషయంపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. రాజుగా పట్టాభిషేకం పొందనున్న కింగ్‌ ఛార్లెస్‌3 భార్య కెమిల్లాకు రాణి హోదా దక్కుతుంది. దీంతో కోహినూర్‌ వజ్రంతో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కూడా కెమిల్లాకు వెళ్లనుంది.
గతంలో బ్రిటన్‌లో జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాణి ఎలిజబెత్‌-2 స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా, ప్రిన్స్‌ చార్లెస్‌కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య ప్రిన్స్‌ డయానాకు 1996లో విడాకులిచ్చారు. విడాకులు ఇచ్చిన ఏడాదికే ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృతిచెందింది.

కోహినూర్‌ను బ్రిటీష్ వాళ్లకు ఇచ్చిందెవరు?

ఈ వజ్రాన్ని సుమారు 5 వేల ఏళ్ల క్రితం తెలుగు నేల మీదే గుర్తించారని చెప్తుంటారు. 1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి చేరిందట. ఆయన దాన్ని తన కిరీటంలో ధరించారట. 1839లో ఆయన మరణం తర్వాత.. కుమారుడు దిలీప్ సింగ్ దగ్గరికి ఆ వజ్రం వెళ్లింది. 1849లో బ్రిటన్ సేనలు అతడిని ఓడించాయట. ఆ సమయంలో అతడు ఆ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి అప్పగించారట. అప్పటి  నుంచి కోహినూర్ డైమండ్ బ్రిటన్ లోనే ఉంటోంది. 1937లో కింగ్ జార్జ్‌-6 ప్లాటినంతో తయారు చేసిన కిరీటంలో 105.6 క్యారెట్ల కోహినూర్‌ను ఉంచి దానిని తన పట్టాభిషేక సమయంలో తన సతీమణికి అలంకరించాడు. అప్పటి నుంచి రాజ కుటుంబీకుల కిరీటంలో మన కోహినూర్‌ వెలుగులీనుతోంది.

ఇండియాకు తిరిగి ఇవ్వమంటే ఇలా అన్నారు..

పలుమార్లు ఈ వజ్రాన్ని తమకు తిరిగి ఇవ్వాలని భారత ప్రభుత్వం ఇంగ్లాండు ప్రభుత్వాన్ని కోరింది. 2010 లో యూకే ప్రధాని డేవిడ్ కెమరాన్ ఈ విషయంపై స్పందించారు. ఒకవేళ భారత్‌‌కు కోహినూర్ తిరిగి ఇవ్వాల్సి వస్తే, చాలా దేశాలకు చాలా తిరిగివ్వాల్సి ఉంటుందన్నారు. అప్పుడు బ్రిటీష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని చమత్కరించారు.

గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా డైమండ్

బ్రిటన్ కు రాణి అయ్యే వారి రాజ దండంలో ఉండే వజ్రం పేరు “గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా డైమండ్”. ఇది సైజులో చాలా పెద్దగా ఉంటుంది. దీని బరువు దాదాపు 530 క్యారెట్లు. ఈ వజ్రం విలువ దాదాపు రూ.31వేల కోట్లు. 1905లో దక్షిణాఫ్రికా లో మైనింగ్ చేస్తుండగా ఇది దొరికింది. బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్ 7 కు బహుమతి గా దీన్ని అప్పట్లో ఇచ్చారని చెబుతుంటారు. ఇంకొందరు బ్రిటీషర్లు దీన్ని కొల్లగొట్టి ఆఫ్రికా నుంచి తీసుకెళ్లారని అంటారు.

టిప్పు సుల్తాన్ రింగ్

1799 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారితో జరిగిన యుద్ధంలో పోరాడుతూ చనిపోతారు. ఆయన చనిపోయాక ఒంటిపై ఉన్న అన్ని ఆభరణాలను బ్రిటీష్ వాళ్ళు తీసుకుంటారు. ఈక్రమంలోనే టిప్పు సుల్తాన్ చేతి వేలికి ఉన్న ఎంతో విలువైన ఉంగరాన్ని కూడా తీసుకెళ్లారు. అయితే ఇది జరిగిన కొంత కాలం తర్వాత ఈ ఉంగరాన్ని బ్రిటన్ లో వేలం వేస్తే.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రూ.కోటిన్నరకు కొన్నట్లు చెబుతారు.

రోసెట్టా స్టోన్

రోసెట్టా స్టోన్ అనేది ఈజిప్టు దేశానికి చెందిన ఒక పురాతన శిలా శాసనం. దీనిపై రెండు వేర్వేరు భాషలకు చెందిన మూడు వేర్వేరు ప్రాచీన లిపుల్లో శిలా శాసనాలు రాసి ఉన్నాయి. వాటిని ఇప్పటివరకు ఒకే ఒక భాషా శాస్త్రవేత్త అర్ధం చేసుకోగలిగాడు. ప్రస్తుతం రోసెట్టా స్టోన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. బ్రిటీష్ వాళ్ళు దీన్ని దొంగిలించి తీసుకెళ్లారని ఈజిప్టు ప్రజలు విశ్వసిస్తుంటారు. ఇది క్రీస్తు పూర్వం 196 సంవత్సరానికి చెందిన శిలా శాసనం కావడం విశేషం.1800 సంవత్సరం లో ఫ్రాన్స్ పై యుద్ధంలో గెల్చిన తర్వాత అక్కడి నుంచి రోసెట్టా స్టోన్ ను బ్రిటన్ కు తీసుకెళ్లారని ఇంకొందరు చరిత్రకారులు వాదిస్తుంటారు.

ఎలెగిన్ మార్బుల్స్

గ్రీస్ లోని ప్రముఖ ప్రాచీన ఆలయం పేరు “పార్తె నాన్”. ఈ ఆలయం గోడలపై ఎంతో అద్భుతమైన శిల్ప కళ ఉండేది. చివరికి ఈ శిల్పాలను కూడా బ్రిటన్ కొల్లగొట్టింది. 1803 సంవత్సరం లో లార్డ్ ఎలెగిన్ అనే బ్రిటీష్ పాలకుడు .. “పార్తె నాన్” ఆలయం గోడలపై ఉన్న అద్భుత శిల్పాలను పెకిలించి లండన్ కు తీసుకెళ్లాడు. వాటిని లండన్ లో వేలం వేయగా బ్రిటీష్ ప్రభుత్వమే కొనుగోలు చేసి, బ్రిటీష్ మ్యూజియం లో భద్రపర్చింది.1925 సంవత్సరం నుంచి వీటిని తిరిగి ఇచ్చేయాలని గ్రీస్ దేశం బ్రిటన్ ను కోరుతోంది. అయినా బ్రిటన్ స్పందించడం లేదు.