సెంట్రల్ మెక్సికన్ రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఒక బార్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సెలయా వెలుపల ఉన్న అపాసియో ఎల్ ఆల్టో పట్టణంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) గుర్తు తెలియని బృందం బార్ వద్దకు వచ్చి లోపల ఉన్న వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించగా.. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళల పరిస్థితి నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు.
దుండగులను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో నేరస్థుల బృందాన్ని సూచించే రెండు పోస్టర్లను అధికారులు గుర్తించారు. పారిశ్రామిక కేంద్రమైన గ్వానాజువాటోలో ఇటీవల కాలంలో కాల్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. గత నెలలో ఇరాపుటో నగరంలోని ఒక బార్లో జరిగిన కాల్పులలో 12 మంది మరణించారు. సెప్టెంబరులో కాల్పుల వలన 10 మంది మరణించారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో హింసను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. 2022లో నరహత్యలు కొద్దిగా తగ్గాయి.