Iran-Afghan Border: నీటి వివాదం కారణంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ (Iran-Afghan Border) భద్రతా దళాల మధ్య శనివారం సరిహద్దులో భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.
తాలిబన్లు కాల్పులు ప్రారంభించారు
పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్లతో కాల్పులు జరిపిన రెండవ పొరుగు దేశం ఇరాన్. శనివారం సరిహద్దులోని తాలిబాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయని ఇరాన్ దేశ డిప్యూటీ పోలీస్ చీఫ్ జనరల్ ఖాసిమ్ రెజాయీ చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపింది.
ఈ కాల్పుల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాల సిబ్బందికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ కాల్పులు ఇరాన్ లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్సుల సరిహద్దులలో జరిగాయి. ఈ సరిహద్దులు ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రోజ్ ప్రావిన్స్కు సరిహద్దుగా ఉన్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో భద్రతా దళాల సిబ్బంది మరణించడం, గాయపడినట్లు IRNA తెలియజేసింది.
Also Read: Warangal Road Accident: వరంగల్ రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు… మాజీ ఎమ్మెల్యే సోదరుడు మృతి
ముగ్గురు సైనికులు మృతి
ఈ కాల్పుల్లో ఇరాన్ సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు సైనికులు, ఒక తాలిబాన్ మరణించినట్లు ఇరాన్కు చెందిన ఆంగ్ల పత్రిక టెహ్రాన్ టైమ్స్ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్తో ఇరాన్ సరిహద్దు ట్రాఫిక్కు మూసివేయబడిందని నివేదించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ ఇరాన్ దళాలు మొదట కాల్పులు జరిపాయని ఆరోపించారు.
ఈ కాల్పుల్లో ఇరు దేశాలకు చెందిన వారు మరణించారని తాలిబాన్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ తెలిపారు.. సరిహద్దులో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మీడియా కథనాల ప్రకారం.. నీటి వివాదంపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలో చాలా మంది గాయపడ్డారు. ఇరాన్ సరిహద్దు బలగాలు నిమ్రోజ్ ప్రావిన్స్లో ఆఫ్ఘనిస్తాన్ వైపు కాల్పులు జరిపాయని టాకోర్ తెలిపారు.