US-Iran : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆయన మరణానంతరం కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ నియామకాన్ని అమెరికా తీవ్రంగా సవాలు చేస్తోంది. మొజ్తబా ఖమేనీతో పాటు ఇరాన్ కీలక భద్రతా అధికారుల వివరాలు అందించిన వారికి భారీ నజరానా ప్రకటిస్తూ అమెరికా తాజాగా ప్రకటన విడుదల చేసింది.
మొజ్తబా ఖమేనీపై అమెరికా ఆరోపణలు
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తొలి దశలోనే అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయన స్థానంలో కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ మార్పును అమెరికా అంగీకరించడం లేదు. మొజ్తబా ఖమేనీని అమెరికా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న నాయకుడిగా అభివర్ణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాడుల ప్రణాళికలు రూపొందిస్తూ, వాటిని అమలు చేయడంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలను వెనుక నుంచి మొజ్తబా ఖమేనీ సమన్వయం చేస్తున్నారని వాషింగ్టన్ భావిస్తోంది. అందుకే ఆయన గురించి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.92 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనను “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కార్యక్రమం ద్వారా శనివారం విడుదల చేసింది.
ఇరాన్ అగ్ర భద్రతా అధికారులపై కూడా బహుమతి
మొజ్తబా ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మరియు నిఘా వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న మరికొందరు నేతలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మొత్తం ఐదుగురు ప్రముఖ అధికారుల వివరాలు అందించిన వారికి కూడా ఇదే విధంగా బహుమతి ప్రకటించింది. అమెరికా జాబితాలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్ఘర్ హెజాజీ, మేజర్ జనరల్ యాహ్యా రహీమ్ సఫావీ, ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కాందర్ మోమేని, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ పేర్లు ఉన్నాయి. వీరంతా ఐఆర్జీసీతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో అస్థిరతకు కారణమవుతున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. సమాచారం అందించాలనుకునే వారు సురక్షిత ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లు లేదా ప్రత్యేకంగా రక్షితమైన ‘టోర్’ నెట్వర్క్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు. అమెరికా ప్రకటించిన ఈ భారీ బహుమతి నేపథ్యంలో ఇరాన్ అగ్రనేతలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆఫర్ను ఎవరైనా వినియోగించి కీలక సమాచారం అందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
