234 Fighters Killed : రష్యా సరిహద్దుల్లో ఘోరం జరిగింది. ఆ దేశంలోకి చొరబడేందుకు యత్నించిన 234 మంది ఉక్రెయిన్ ఫైటర్లను రష్యా ఆర్మీ హతమార్చింది. ఈవిషయాన్ని రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్ ఫైటర్ల చొరబాటు యత్నాలను రష్యా భద్రతా బలగాలు బలంగా తిప్పికొట్టాయని వెల్లడించింది. ఈక్రమంలో రష్యా బార్డర్లో ఉక్రెయిన్కు చెందిన 7 యుద్ధ ట్యాంకులు, ఐదు సాయుధ వాహనాలను నాశనం చేశామని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
రష్యా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మార్చి 15 నుంచి 17 వరకు జరగనుంది. దీనికి సరిగ్గా కొన్ని రోజుల ముందేే రష్యాలోకి చొరబడేందుకు వందలాది మంది ఉక్రెయిన్ ఫైటర్లు(234 Fighters Killed) యత్నించడం గమనార్హం. ఈ పరిణామంతో రష్యాలో కలవరం చెలరేగింది. పుతిన్ నాయకత్వం ఉండటం వల్లే బార్డర్లో చొరబాటు ఆగిందనే కోణంలో రష్యా మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ఎన్నికల్లో పుతిన్కు కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు మంగళవారం రోజు రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో రష్యాలోని రెండు చమురు శుద్ధి క్షేత్రాలను డ్రోన్లు తాకాయి. తమ దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో డ్రోన్లు పడ్డాయని రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా రాజధాని మాస్కోపైకి దూసుకొచ్చిన ఓ డ్రోన్ను ఆర్మీ కూల్చేసింది.
అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అణ్వస్త్ర ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అమెరికాకు సమానంగా అంతరిక్ష సామర్థ్యాలను మాత్రమే తమ దేశం అభివృద్ధి చేసిందని తెలిపారు. కొన్ని దేశాలు కావాలనే రష్యాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని పుతిన్ ఆరోపించారు. అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు తమతో కలిసి నడవాలని పాశ్చాత్యదేశాలను కోరామని చెప్పారు. అయినా కొన్ని ఐరోపా దేశాలు ముందుకు రాలేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి పుతిన్ కామెంట్ చేశారు.