బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (Dhaka)లోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం భారీ పేలుడు (Blast) సంభవించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. మంగళవారం పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే 11 అగ్నిమాపక శకటాలను సంఘటనా స్థలానికి తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు డీఎంసీహెచ్ పోలీస్ ఔట్పోస్ట్ ఇన్స్పెక్టర్ బచ్చు మియా తెలిపారు. వీరంతా ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ భవనంలో శానిటరీ ఉత్పత్తుల కోసం అనేక దుకాణాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రక్కనే ఉన్న భవనంలో BRAC బ్యాంక్ శాఖ కూడా ఉంది. పేలుడు ధాటికి బ్యాంకు అద్దాలు పగిలిపోయాయి. రోడ్డుకు అవతలి వైపు ఆగి ఉన్న బస్సు కూడా ధ్వంసమైంది.
Also Read: PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!
ఇప్పటి వరకు 17 మృతదేహాలు లభ్యమయ్యాయని, అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో అన్వేషణ కొనసాగుతోంది. స్థానిక దుకాణదారుడు సఫాయెత్ హుస్సేన్ మాట్లాడుతూ.. మొదట భూకంపమే అనుకున్నాను. పేలుడు ధాటికి సిద్దిక్ మార్కెట్ మొత్తం దద్దరిల్లింది. దెబ్బతిన్న భవనం ముందు రోడ్డుపై 20-25 మంది పడి ఉండడం చూశాను. వారు తీవ్రంగా గాయపడ్డారు. వారు సహాయం కోసం కేకలు వేశారని చెప్పాడు.
అంతకుముందు గత శనివారం బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లోని ఆక్సిజన్ ప్లాంట్లో పేలుడు సంభవించిన తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. సీతకుంట ఉపజిల్లాలోని కేశబ్పూర్ ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్లో పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత మంటలు ఎగిసిపడడం చూశామని వారు చెప్పారు. ఫిబ్రవరిలో ఢాకాలోని నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.