Tragedy in Mumbai: ముంబైలో తీవ్ర విషాదం నెలకొంది. భాండూప్లోని సుష్మా స్వరాజ్ పాలికా ప్రసూతి గృహంలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ప్రసవ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్తు అంతరాయం కారణంగా ఫ్లాష్లైట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. అయితే ఓ గర్భిణికి సిజేరియన్ సమయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ తల్లి కూడా చనిపోయింది. దీంతో బాధిత బంధువులు ఆస్పత్రి యాజమాన్యంపై ఘర్షణకు దిగారు. వైద్యుల నిర్లక్షమే కారణమని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, జనరేటర్ సౌకర్యం లేకపోవడం వల్లనే తమ వాళ్ళని కోల్పోయామని బంధువులు ఆవేదన చెందారు. వివరాలలోకి వెళితే..
We’re now on WhatsApp. Click to Join
భందుప్ హనుమాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్సారీ కుటుంబంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఈ ఘటనలో సైదున్నిసార్ అన్సారీ తన పాపతో సహా మృతి చెందింది. ఆమెకు నొప్పులు ఎక్కువవడంతో స్వరాజ్ పాలికా ప్రసూతి గృహంలో అడ్మిట్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా రక్తస్రావం కావడంతో.. పాప గుండె వేగం తగ్గుతోందని డాక్టర్ ఆమెను సిజేరియన్కు తీసుకెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఈ క్రమంలో శిశువు అధిక బరువుతో ఉండటం మరియు హృదయ స్పందన రేటు చాలా పడిపోవడంతో శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. మరోవైపు కోడలు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను సియోన్ ఆస్పత్రిలో చేర్పించాలని కోరారు. ఆసుపత్రిలో చేర్చేలోపే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. డాక్టర్ తప్పిదం వల్లే పాప, తల్లి చనిపోయారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రసవ సమయంలో ఒక్కసారిగా పవర్ కట్ కావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ రోగి బంధువులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివార్లలో నిర్లక్ష్య పాలన కారణంగా నవజాత శిశువు చనిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక మరణాలు చోటు చేసుకున్నాయి.
వైద్యులు మరియు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గతంలో శస్త్రచికిత్స సమయంలో మహిళ పొట్టపై దూది పెట్టి, పాప ఏడుస్తోందని నోటికి టేప్ పెట్టిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దాని తర్వాత సంబంధిత వైద్యులు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.