Viral News : టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే.. నేరుగా బీచ్ లోకి తీసుకెళ్లింది

దారి తెలియకపోతే మ్యాప్స్(Maps) సహాయం తీసుకుంటాం. ఒక్కోసారి ఆ జీపీఎస్(Gps) కూడా మనల్ని బోల్తా కొట్టిస్తుంది. ఎంతలా అంటే.. జీపీఎస్ ను నమ్ముకుని గుడ్డిగా వెళ్లిన ఓ జంట నేరుగా వెళ్లి సముద్రంలో పడ్డారు.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 08:30 PM IST

మనకు తెలియని విషయం గురించి క్షణాల్లో తెలుసుకోవాలంటే.. అరచేతిలో ఉండే ఆరంగుళాల స్మార్ట్ ఫోన్(Smart Phone) ను టక్కున ఓపెన్ చేసి సెర్చ్ చేసేస్తాం. గ్యాడ్జెట్స్, టూరిజం స్పాట్స్, ఆధ్యాత్మిక ప్రదేశాలు, వంట-వార్పు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, పిల్లలు చూసే ప్రోగ్రామ్స్, తినే ఫుడ్ ఇలా ఒకటేమిటి.. దాదాపు అన్నింటికీ స్మార్ట్ ఫోన్ పై ఆధారపడిపోతున్నాం. ఇక ఏదైనా కొత్తప్రదేశానికి వెళ్లినపుడు.. దారి తెలియకపోతే మ్యాప్స్(Maps) సహాయం తీసుకుంటాం. ఒక్కోసారి ఆ జీపీఎస్(Gps) కూడా మనల్ని బోల్తా కొట్టిస్తుంది. ఎంతలా అంటే.. జీపీఎస్ ను నమ్ముకుని గుడ్డిగా వెళ్లిన ఓ జంట నేరుగా వెళ్లి సముద్రంలో పడ్డారు. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు. అమెరికాలోని(America) హవాయి రాష్ట్రంలో.

కైలువా-కోన ప్రాంతంలోని హునోకోహౌ స్మాల్ బోట్ హార్బర్ లోకి ఇద్దరు పర్యాటకులు శనివారం(ఏప్రిల్ 29) భారీ SUVలో వెళ్లారు. మాంటరే ఎక్స్‌కర్షన్ అనే ప్రదేశానికి వెళ్లేందుకు జీపీఎస్ ను అనుసరిస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి SUV నేరుగా హార్బర్ లోకి వెళ్లి సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో వారిద్దరూ సీట్ బెల్ట్ లు పెట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పడవల్లో ఉన్న సిబ్బంది వారిని గ్రహించి వెంటనే నీటిలోకి దూకి కారులో చిక్కుకున్న ప్రయాణికురాలిని రక్షించారు. మరో వ్యక్తి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం SUVకి తాళ్లు కట్టి ఒడ్డుకు లాగారు. కాగా ఆ ఇద్దరూ తాము సముద్రంవైపు వెళ్తున్నామని గ్రహించకుండా చాలా ఆత్మవిశ్వాసంతో జీపీఎస్ ను నమ్ముకుని కారును వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్లినట్లు తెలిపారు.