Emergency Exit: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం.. వీడియో వైరల్..!

గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (IndiGo Flight) 6E457కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.

Published By: HashtagU Telugu Desk
Emergency Exit

Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Emergency Exit: గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (IndiGo Flight) 6E457కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit) డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం గురించి సమాచారం ఇస్తూ త్రిపుర రాజధాని అగర్తలలోని విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరవడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. విమానం గాలిలో ఉండగానే ప్రయాణికుడు ఈ ప్రయత్నం చేశాడని చెప్పారు.

ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నం

అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్ ను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించినప్పుడు 41 ఏళ్ల ప్రయాణీకుడు బిస్వజిత్ దేబ్‌నాథ్‌ను ఇతర ప్రయాణికులు అడ్డుకున్నారని అధికారులు తెలిపారు. క్యాబిన్ సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ విమానం అస్సాంలోని గౌహతి నుంచి అగర్తల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

గురువారం ఇండిగో విమానం 180 మంది ప్రయాణికులతో గౌహతి నుండి అగర్తల విమానాశ్రయానికి బయలుదేరింది. విమానం ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్న ఓ యువకుడు అకస్మాత్తుగా విమానం ఆకాశంలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం విమాన సిబ్బంది దృష్టికి వెళ్లడంతో వారు పరుగులు తీశారు. కానీ అతను వారిని పట్టించుకోకుండా తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. అప్పుడు విమానంలోని ఇతర ప్రయాణికులు యువకుడిని లాగి కొట్టారు. ఈ ఘటన విమాన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

Also Read: Biden Meets Zelenskyy: ఉక్రెయిన్​కు మరోసారి అమెరికా భారీ సాయం.. ఎంతంటే..?

ఎలాగోలా ఎట్టకేలకు విమానం సురక్షితంగా అగర్తల విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడ అదుపులోకి తీసుకున్న నిందితుడు యువకుడిని ఇండిగో ఎయిర్‌లైన్స్ తరపున విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. అతనిపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువకుడు మత్తు మాత్రలు సేవించి ఈ నేరానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రయాణికుడి పేరు బిస్వజిత్ దేబ్నాథ్.

ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఓసీ అభిజీత్ మండల్ మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ పోలీస్ స్టేషన్‌కు పంపిందని తెలిపారు. పోలీసులు విమానాశ్రయానికి చేరుకుని నిందితుడు దేబ్‌నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.

  Last Updated: 22 Sep 2023, 09:32 AM IST