తాజాగా మణిపూర్ లో మరొకసారి జాతీయ రహదారిని నిర్బంధిస్తున్నట్లు కుకీ సంఘాలు వెల్లడించాయి. నేడు తెల్లవారుజామున సమయం నుంచి దిమాపుర్-ఇంఫాల్కు వెళ్లే జాతీయ రహదారి పై రాకపోకలనుఅడ్డుకొంటున్నారు. ఈ కారణంగా మైతేయిలు నివసించే ఇంఫాల్ లోయకు నిత్యావసర సరఫరాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. జిరిబామ్-ఇంఫాల్ మార్గమైన ఎన్హెచ్-37ను కూడా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
కుకీ-జొ జాతుల రక్షణలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవ్వడంతో పర్వత ప్రాంతాలకు నిత్యావసర సరుకుల సరఫరాలో వైఫల్యం కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకొని ఆందోళనలు చేస్తామని ది కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ పేర్కొంది. కాగా గతవారం నాగా జాతి అధికంగా ఉండే ఉఖ్రుల్ జిల్లాలో ఒక కుకీ-జొ విలేజ్ వాలంటీరు హత్యకు గురైన విషయం తెలిసిందే. అదేవిధంగా మరొకవైపు చురాచాంద్పుర్, తెంగ్నౌపాల్ వంటి పర్వత ప్రాంత జిల్లాలకు నిత్యావసరాలను సరఫరా చేసే మార్గాన్ని మైతేయిలు మూసివేశారు. ఆగస్టు 19న అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ ముఖ్యమైన ఔషధాలు, పిల్లల టీకాలను తీసుకొని ముందుకెళ్లలేకపోయింది.
దీంతో హెలికాప్టర్లలో ఔషధాలను తరలించాల్సి వచ్చింది. వీటితో పాటుగా కాంగ్పోక్కి, సేనాపతి జిల్లాలకు కూడా ఔషధాల తరలింపును అడ్డుకొన్నారు. దీంతో అల్లరి మూకలను పోలీసులు నియంత్రించాల్సి వచ్చింది. ఇది ఎలా ఉంటే మరొకవైపు మణిపుర్ పోలీసులు మాత్రం నిత్యావసరాల రవాణాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. నిత్యావసరాలతో వస్తున్న 163 ట్రక్కులకు రక్షణ ఇచ్చి పంపించాము. సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సాఫీగా ఉండేలా భద్రతా కాన్వాయ్ను కూడా ఇస్తున్నాము అని వారు వెల్లడించారు.