Beggar Woman : ఈ బెగ్గర్ సంపాదన నెలకు లక్షల్లోనే.. ఆస్తులు కూడా !

Beggar Woman : ఓ మహిళ తాను భిక్షాటన చేయడమే కాక.. తన పిల్లలను కూడా బలవంతంగా భిక్షాటన వృత్తిలోకి దింపింది.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 12:16 PM IST

Beggar Woman : ఓ మహిళ తాను భిక్షాటన చేయడమే కాక.. తన పిల్లలను కూడా బలవంతంగా భిక్షాటన వృత్తిలోకి దింపింది. బలవంతంగా పిల్లలతో భిక్షాటన చేయించిన నేరానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఇంద్రాబాయ్‌ అనే మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంటరాగేట్ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె భిక్షాటన ద్వారా 6 వారాల్లోనే రూ.2.5 లక్షలు సంపాదించిందని తేలింది. ఇంద్రాబాయ్‌‌కు వ్యవసాయ భూమి, రెండు అంతస్తుల భవనం, ఓ బైక్, రూ.20వేల ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ కూడా ఉన్నాయని వెల్లడైంది. ఇంద్రాబాయ్‌, ఆమె పిల్లలు కలిసి భిక్షాటన(Beggar Woman) చేసి ఇవన్నీ కూడగట్టారట.

We’re now on WhatsApp. Click to Join

పోలీసులకు దొరికిపోయాక..

ఫిబ్రవరి 9న ఇంద్రాబాయ్‌‌ తన కుమార్తెతో కలిసి భిక్షాటన చేస్తూ పట్టుబడింది. అయితే ఆమె భర్త, ఇద్దరు పెద్ద పిల్లలు పరారయ్యారు. ఇంద్రాబాయ్‌‌ వద్ద రూ.19,600, ఏడేళ్ల బాలిక వద్ద రూ.600 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టుకు ముందు 45 రోజుల్లో రూ.2.5 లక్షలు సంపాదించినట్లు ఇంద్రాబాయి వెల్లడించారు. రాజస్థాన్‌లోని కోట సమీపంలో తనకు రెండంతస్తుల ఇల్లు, వ్యవసాయ భూమి ఉందని, మంచి స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నానని, తన భర్తకు బైక్‌ ఉందని చెప్పింది.

ఐదుగురు పిల్లలతో భిక్షాటనకు ప్లాన్

ఇంద్రాబాయికి 10, 8, 7, 3, 2 సంవత్సరాల వయసున్న ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద పిల్లలను ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి వెళ్లే మార్గం ఇండోర్‌లోని రద్దీగా ఉండే లువ్ కుష్ స్క్వేర్‌లో భిక్షాటనకు వదిలేది. ఉజ్జయినికి వెళ్లే వాహనాలు మలుపు తీసుకునే పాయింట్ కావడం వల్లే దీన్ని ఆమె ఎంచుకునేది. ఆలయానికి వేళ్లే భక్తులు తమలాంటి యాచకులను తరిమికొట్టే అవకాశం ఉండదని తెలిపింది. మహాకాల్ లోక్ నిర్మాణం తర్వాత తన సంపాదన పెరిగిందని ఇంద్రాబాయి వెల్లడించడం గమనార్హం. ‘ఆకలి వల్లే మేం అడుక్కునే మార్గం ఎంచుకున్నాం. దొంగతనం చేయడం కంటే ఇదే బెటర్’ అని తన ఏడేళ్ల కుమార్తెతో వీధుల్లో తిరుగుతూ ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్‌తో ఇంద్రా బాయి వాదించడం గమనార్హం.

Also Read : Sundar Pichai : సుందర్ పిచాయ్ పొద్దున్నే చూసే వెబ్‌సైట్ ఇదే.. విశేషాలివీ

7000 మంది యాచకులు.. ఏడాదికి 20 కోట్లు

బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి పనిచేస్తున్న ఆ ఎన్‌జీఓ.. ఇండోర్‌లోని 38 ప్రధాన కూడళ్ల నుంచి దాదాపు 7,000 మంది యాచకుల డేటాను సేకరించింది. ఈ 7వేల మంది యాచకుల్లో 50 శాతం మంది పిల్లలే ఉండటం గమనార్హం. ‘ఒక స్థూల అంచనా ప్రకారం వారు సమిష్టిగా ఏడాదికి రూ. 20 కోట్లకు పైగా సంపాదిస్తారు’ అని ఎన్జీఓ వాలంటీర్ రూపాలి జైన్ మీడియాకు చెప్పారు.