Jailed For Coughing : కరోనా సోకినా అతడు సీరియస్ గా తీసుకోలేదు. తాను పనిచేసే ఆఫీసులో దగ్గుతూ అటూఇటూ తిరిగాడు. దీంతో సహోద్యోగులు ఇబ్బందిపడ్డారు. వారు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన సింగపూర్ లోని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో భారత సంతతికి చెందిన 64 ఏళ్ల తమిళ్ సెల్వంను దోషిగా నిర్ధారించిన కోర్టు.. రెండు వారాల జైలుశిక్ష విధించింది. సింగపూర్లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం 6 నెలల జైలు శిక్షతో పాటు 10వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. వాటి అమలులో భాగంగా న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఆదేశాలు ఇచ్చింది.
తమిళ్ సెల్వం సింగపూర్లోని ఓ కంపెనీలో క్లీనర్గా పని చేస్తున్నాడు. అతనికి 2021 అక్టోబర్ 18న ఆరోగ్యం బాగలేకపోవడంతో కొవిడ్ టెస్టులు చేయించుకున్నాడు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. అయితే, అతను నేరుగా ఇంటికి వెళ్లకుండా.. ఈ సమాచారాన్ని తెలిపేందుకు తాను పనిచేసే కంపెనీకి వచ్చాడు. దీంతో అక్కడున్న తోటి ఉద్యోగులు వెంటనే వెళ్లిపోవాలని తమిళ సెల్వంకు సూచించారు. అయినా తమిళ్ సెల్వం పట్టించుకోకుండా.. అక్కడే దగ్గుతూ (Jailed For Coughing) తిరిగాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అతడి దగ్గుతో సహోద్యోగులు ఇబ్బందిపడ్డారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. కరోనాను తమిళసెల్వం సీరియస్గా తీసుకోలేదని భావించిన కోర్టు అతడికి జైలుశిక్ష విధించింది.